నేడు స్పీకర్ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తెలుగుదేశం సభ్యుల పట్ల అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్ మధుసూదనాచారిని కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్షం నిర్ణయించింది. టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో ఆదివారం స్పీకర్ను ఆయన చాంబర్లో గానీ, నివాసంలో గాని క లవాలని భావిస్తున్నారు.
ఈ మేరకు ఆయన అపాయింట్మెంట్ కోరినట్టు పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కవితపై ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిస్థితుల్లో వారంరోజుల సస్పెన్షన్ ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
10 రోజుల క్రితం సభలో జరిగిన సంఘటనను తెరపైకి తెచ్చి రేవంత్రెడ్డి ప్రసంగించేందుకు లేవగానే సభ్యులు అల్లరి చేయడం, ముఖ్యమంత్రే సభలో రేవంత్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడాన్నీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఒక సభ్యుడున్న పార్టీని, 15 మంది సభ్యులున్న పార్టీని కూడా ఒకే దృష్టితో చూస్తూ బీఏసీలో టీడీపీ నుంచి ఒక్కరికే అవకాశం ఇవ్వడంపైనా అభ్యంతరం తెలుపనున్నారు.