మన తెలంగాణ-మన వ్యవసాయం
⇒ రైతు చైతన్య యాత్రల పేరు మార్పు
⇒ నేటి నుంచి జిల్లాలో అమలు
⇒ 12 శాఖల అధికారులతో సూచనలు
⇒ రైతులకు అవగాహన కల్పించనున్న అధికారులు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్లో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి.. ఎలాంటి విత్తనాలు నాటాలి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు వ్యవసాయ శాఖ, సంబంధిత 12 శాఖల అధికారులతో మంగళవారం నుంచి జూన్ 5వ తేదీ వరకూ రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు.
‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ పేర ఈ యాత్రలు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు రోజ్లీలా తెలిపారు. 52 మండలాల్లోని 1,600 గ్రామాల్లో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం రైతు చైతన్య యాత్రల పేరిట నిర్వహించేవారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మన తెలంగాణ-మన వ్యవసాయం పేర యాత్రలు నిర్వహిస్తున్నారు.
ఇందులో వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన, పశుసంవర్ధకశాఖ మార్కెటింగ్, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ, విద్యుత్, అటవి, బ్యాంకులు, నీటిపారుదల, మార్క్ఫెడ్ తదితర శాఖల అధికారులతోపాటు శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు. దీనికి సంబంధిత మండలంలో మండల వ్యవసాయ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా.. జిల్లాలో ఎండల త్రీవత ఎక్కవగా ఉన్నందునా.. ఉదయం రెండు గ్రామాలు, సాయంత్రం రెండు గ్రామాల చొప్పున పర్యటించనున్నారు.