నేడు ‘సార్వత్రిక’ ఓట్ల లెక్కింపు


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:  రోజుకో సమీకరణ.. సమీక్ష, కొంతసేపు ఉత్సాహం... ఆ వెంటనే నిరుత్సాహం. గతం లో ఎన్నడూ లేని విధంగా తిరిగాం... డబ్బు ఖ ర్చు పెట్టాం కదా! అన్న ధీమా. ఆ కొద్దిసేపటికే ఎన్నికల నిధులు నేరుగా ఓటర్లుకు చేరాయా? ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద ఆగిపోయాయా? ఓ సర్వేలో అనుకూలం.. మరోటి ప్రతికూలం.. ఇలా సార్వత్రి క ఎన్నికలలో పోటీ చేసిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులలో సాగిన ఉత్కంఠకు శుక్రవా రం తెరపడనుంది.



 సర్వేలు, సొంత లెక్కలను కట్టిపెట్టి ‘గుబులు గుబులుగా గుండెల దడగా’ అభ్యర్థులు, వారి అనుచరులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు హాజరుకానున్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలకు కొంత మోదం, ఇంకొంత ఖేదం కలిగించగా.. ఆ ఎన్నికలు ఫలితాలు సైతం ప్రధాన పార్టీల నేతలను ఆందోళనకు గురి చేశాయి. ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న నేతలను ఓ వైపు సర్వేలు.. మరో వైపు క్రాస్ ఓటింగ్ భయపెడుతుండగా వారి భవితవ్యం నేడు తేలనుంది.



 టెన్షన్.. టెన్షన్

 ప్రధాన రాజకీయ పార్టీల నేతలలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 16 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నవారిలో మళ్లీ నేడు వెలువడే ఫలితాలు గుబులు రేపుతున్నా యి. వరుసగా మూడు ఎన్నికలు, సుమారుగా రెండు నెలలపాటు విరామ మెరుగని ప్రచారంతో అలసిన నేతల భవితవ్యం తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందూరు జిల్లాలో కీలకంగా మారాయి.



రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, నిజామాబాద్ పార్లమెంట్, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెల కొంది. పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ స్థానాలలో కాంగ్రెస్ ప్రముఖులు డీఎస్, షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేష్‌రెడ్డిల గెలుపు ఓటములపై చర్చ ఆసక్తికరంగా మారింది. హోరాహోరిగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా  మారింది.



 ఇక్కడ ఆసక్తికరం

 నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయగా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, సిట్టింగ్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీపై ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, కొత్తగా వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన సింగిరెడ్డి రవీం దర్‌రెడ్డి, అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్ తదితరుల గెలుపు ఓటములపై చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్ శాతం, సరళిని అంచనా వేస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎవరికీ వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.



 డిచ్‌పల్లి సీఎంసీ వేదికగా

 నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 101 మంది పోటీలో ఉన్నారు. మొత్తం తొమ్మిది నియోజకవర్గాలలోని 2,057 పోలింగ్ కేంద్రాలలో 5,332 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 18,52,970 మంది ఓటర్లకు 13,25,045 మంది (71.51 శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డిచ్‌పల్లి సమీపంలోని సీఎంసీ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచారు.



శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవనుండగా, డిచ్‌పల్లి సీఎంసీ వేదిక అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్‌పీ డాక్టర్ తరుణ్‌జోషి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, పారా మిలటరీ బలగాలను మోహరించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి, కౌంటిం గ్ పాసులు ఉంటేనే ఎవరినైనా అనుమతించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top