పోచారం గిది మా గాచారం

పోచారం గిది మా గాచారం - Sakshi


ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అయ్యా.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారూ.. కా లం కలిసిరాక ఏటా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాం. దీంతో మా జిల్లా అన్నదాతలు ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 72 మందికి పైగానే తనువు చాలించారు. కానీ.. అధికారుల లెక్కల ప్రకారం 18 మంది మాత్రమేనట. ఇదెక్కడి న్యాయం. సర్కారు సాయం అందక.. పెట్టుబడికి రుణాలు లేక.. కరెంటు కోతలతో పంటలు ఎండి.. శక్తులన్నీ ఒడ్డి, ఆస్తులనమ్మి.. కొండంత ఆశతో పంటలు సాగు చేస్తే నెర్రెలు బారిన నేలలు మా గుండెలు పగిలేలా చేసినయ్. దిగుబడి రాక అప్పు లు గుదిబండలా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉరివేసుకుని.. పురుగుల మందులు తాగి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. నేడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా..

 

ప్రభుత్వం గుర్తించింది..

ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు 51 మంది రైతు కుటుంబాల్లో దర్యాప్తు నిర్వహించి 18 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించింది. కొత్త ప్రభుత్వం వచ్చినా అన్నదాతల బతుకులు మాత్రం మారడం లేదు. పైగా రైతులకు మరిన్ని సమస్యలు పెరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన సర్కారు రైతుల సంక్షేమానికి అనేక వాగ్దానా లు చేసి అధికారంలోకి వచ్చి ఆరు నె లలు గడుస్తున్నా వారి సమస్యలు పూ ర్తిస్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు.



ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల మాఫీ, సాగుకు కొత్త రుణాల మంజూరు, గతేడాది దెబ్బతిన్న పంటకు నష్టపరిహారంలో జాప్యం, పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో జిల్లాలో 72మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయినా.. రైతు ఆత్మహత్యలు వాస్తవం కా దంటూ తప్పుడు నివేదికలిస్తున్నారు. జిల్లాలో ఈ ఆరు నెలల్లో కేవలం 51 మంది రైతుల ఆత్మహత్యల గురించి అధికారులు దర్యాప్తు జరిపి 18మంది రైతులు వ్యవసాయంలో ఇబ్బందుల తో ఆత్మహత్యలు చేసుకున్నారని తే ల్చారు. వారికి మాత్రమే ప్రభుత్వ స హాయం అందే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

 

అందని రుణాలు..

గతంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసి ప్రభుత్వం కొత్త రుణాలు అందిస్తుందని రైతులు ఎదురుచూస్తే వారికి నిరాశే ఎదురైంది. రుణ మాఫీకి ప్రభుత్వం నెలల తరబడి కాలయాపన చేస్తూ 25 శాతం ప్రకటించింది. పాత రుణాలు మాఫీ అయి కొత్త రుణాలు అందుతాయని ఖరీఫ్ సాగు పెట్టుబడి ఖర్చులకు అవుతాయని బ్యాంక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులకు ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది రూ.2,280 కోట్లు ఖరీఫ్, రబీ కలిపి జిల్లా రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.



ఖరీఫ్, రబీ కలిపి ఇప్పటివరకు 2 లక్షల 40 వేల 976 మంది రైతులకు రూ.1,163 కోట్ల 89 లక్షలు అందించారు. ఈ లెక్కన ఖరీఫ్ సాగు పూర్తయినా సగం మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో రుణాలు అందలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సాగు చేసే పరిస్థితి లేక.. రుణం కోసం బ్యాంక్ వైపు చూసే పరిస్థితి లేక రుణ లక్ష్యం నీరుగారుతోంది. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,693 కోట్ల 74 లక్షలు కాగా, రబీ రూ. 534 కోట్ల 86 లక్షలు ఇవ్వాలని ఈ ఏడాది నిర్ణయించారు.

 

అందని పంటనష్టం పరిహారం..

అతివృష్టి, వడగళ్ల వానలతో వేలాది హెక్టార్లలో పం టలు నీటమునిగాయి. అధికారులు సర్వేచేసి ప్రభుత్వనికి నివే దిక అందించారు. నష్టపోయిన రైతులుకు పంట పరిహారం ఇంతవరకూ అందలేదు. వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతుల తప్పిదాలతో అనర్హుల జాబితాల్లో పరిహారం జమ అయ్యింది. పంట భూములు లేనివారికి పంటలు వేయని వారికి పరిహారం అందింది. కొంత మంది పంట నష్ట పోయినప్పుడు రైతుల ఖాతాల నెంబర్లు సరిగా లేవని అధికారులు పేర్కొంటున్నారు.

 

కరువు కరాళ నృత్యం

జిల్లా వ్యప్తంగా 3.90 లక్షల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. పంటలు 80 శాతం వర్షాధారంపైనే ఆధారపడ్డారు. గతేడాది అతివృష్టి, వడగళ్లతో పంటలను నష్టపరిస్తే ఈ ఏడాది అనావృష్టితో పంటలు ఎండిపోయాయి. ఖరీఫ్‌లో కరువు రక్కసి కరాళనృత్యం చేసింది. ఈ ఖరీఫ్‌లో 6.50 లక్షల హెక్టార్ల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. తగ్గిన వర్షాభావ పరిస్థితులతో 5.47 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలో 52 మండలాలకుగాను 41 మండలాలను కరువు మండలాలుగా వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వం రుణాలు అందించకపోవడంతో పంట సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను అశ్రయిస్తున్నారు.

 

తగ్గిన వర్షపాతం..

గతేడాది ఖరీఫ్ సమయానికి 1382 మిల్లీమీటర్ల వర్షపాతం (సాధారణం కంటే అధికంగా) కురిసింది. ఈసారి నవంబర్ వరకు 743 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దాదాపు 32 శాతం మేర తక్కువగా న మోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జలాశయాల కింద పంట సాగు చేసుకునేందుకు రైతులు వెనుకడుగు వేయాల్సి వ స్తోంది. శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) జలాశయం వర ద నీరు పూర్తిస్థాయిలో రాలేదు. మిగితా జలాశయా ల పరిస్థితీ అదేవిధంగా ఉంది. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరందక దిగుబడి భారీగా పడిపోయింది.



రబీ సాగులో ప్రాజెక్టుల నీటితో సాగు చేసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో వరి సాగు చేపట్టొద్దని ప్రభుత్వమే చెబుతోంది. ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందుకే.. రబీ 90 వేల హెక్టార్లకు కావాల్సి ఉండగా 20 వేలకే పరిమితమైంది. జిల్లాలో 52 మండలాలకు గాను 11 మండలాల్లో 70 శాతం వర్షపాతం నమోదైంది. 41 మండలాల్లో 80 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయని.. వ్యవసాయ అధికారులు కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

 

కరెంటు కష్టాలు

బోరు బావుల్లో నీరున్నా పంటలకు అందించడానికి వీలు లేకుండా పో తోంది. రైతులను కరెంటు కోతలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న 7 గంటల కరెంటును 5 గంటలకు కుదించారు. సరఫరాలోనైనా మూడుగంటలు పూ ర్తిస్థాయిలో ఇవ్వక ఖరీఫ్‌లో పంట లకు నీరు అందించలేకపోయారు. రబీ సాగు చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేశారు.

 

ఖాళీల తీరు..

జిల్లాలో 52 మండలాలకు గాను 98 వ్యవసాయ అధికారులు (ఏఓ)లు ఉండాలి. కానీ.. 55 మంది ఏవోలు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 43 ఖాళీలు ఉన్నాయి. అంతేకాకుండా మండల విస్తరణ అధికారులు (ఏఈవో) 134 పోస్టులకు గాను 97 మంది పనిచేస్తుండగా, 43 ఖాళీలు ఉన్నాయి. జిల్లా సహా య ఉపసంచాలకులు మూడు పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. కొన్ని కొంత మంది అధికారులకు రెండు మూడు మండలాలు అప్పజెప్పడంతో పూర్తిస్థాయి లో రైతులకు న్యాయం జరగడం లేదు. సాగు దిగుబడి తెలియక పాత పద్ధతులనే అనుసరిస్తూ నష్టపోతున్నారు. కొత్త వంగడాలు, యాంత్రీకరణ పద్ధతులను ఎప్పటికప్పుడు అన్నదాతలకు తెలిపి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాల్సి ఉంటుం ది. క్షేత్రస్థాయి అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

 

పేరుకే పరీక్ష కేంద్రాలు..

భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాకు నాలుగున్నా జిల్లా కేంద్రంలో మినహా ఇంద్రవెల్లి, నిర్మల్, మంచిర్యాల లో ఎక్కడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో అధికారులు, పరికరాలు లేక రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించేవారు కరువయ్యారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితా ల ఆధారంగా పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించే విధంగా సలహాలు, సూచనలు అందించేవారు కరువయ్యారు.



ఈ పరీక్ష కేంద్రాలకు నాలుగు ఏవో స్థాయి అధికారులతోపాటు ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ.. జిల్లా కేంద్రంలో ఎని మిది మందికి ముగ్గురు ఏవోలు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు భూసార పరీక్ష కేంద్రాల ద్వారా 10,500 పరీక్ష నమూనాలు లక్ష్యం కాగా, సిబ్బంది కొరతతో జాప్యం జరుగుతోంది. సగం వరకు నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.

 

అందరికీ ఇవ్వాలి..

జిల్లాలో 72 మంది రైతులు రుణాలు అందక పంటలు ఎండిపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారుల ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి దిగుబడులు రాక.. అప్పులు తీర్చ లేక తనవు చాలిస్తున్నా. అలాంటి కుటుంబాలందరికీ జీవో 421 సవరించి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. అప్పుడే ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది.

 - ముడుపు ప్రభకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top