నేడు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి పర్యటన
మహబూబ్నగర్ జిల్లాలో పథకాలపై పరిశీలన.. సీఎం కేసీఆర్తో భేటీ
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా ఒక రోజు పర్యటనకోసం రాష్ట్రానికి రానున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ నీతి ఆయోగ్ కార్యక్రమాలను ఆయన సమీక్షించనున్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తూరు, ఫరూక్నగర్ మండలాల్లో పర్యటిస్తారు. అలాగే చిన్నయ్య చెర్వులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పరిశీలిస్తారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు, హరితహారం నర్సరీలను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారు. మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో భేటీ అవుతారు. తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు.