పర్యాటకులను ఆకర్షించాలి

పర్యాటకులను ఆకర్షించాలి


సాక్షి, హైదరాబాద్: ఇంటికి చుట్టాలు రాకుంటే ఎంత దరిద్రమో రాష్ట్రానికి పర్యాటకులు రాకపోయినా అదే పరిస్థితి అని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ పేర్కొన్నారు. అందువల్ల పర్యాటకులను ఆకర్షించాలని పర్యాటకశాఖకు సూచించారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం గురించి పర్యాటకశాఖ తెలియజేసి, రాష్ట్రానికి అతిథులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోం దని, వాటిని ప్రజలంతా సద్వినియోగం చే సుకోవాలని సూచించారు.



గతంలో తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రిలో ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా రోగం తగ్గలేదని... గండిపేట చెరువుకు తరచూ విహారానికి వెళ్లగా రోగం నయమైందన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాలు ఉమ్మడి ఏపీలో మరుగునపడ్డాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవేదన వ్యక్తంచేశారు. భువనగిరి కోట, రామప్ప గుడి వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని...పాఠశాల విద్యార్థులు సబ్సిడీపై వాటిని తిలకించేలా చేస్తామన్నారు.

 

పర్యాటకానికి 500 కోట్లు: పేర్వారం

మానవాళిని ఒకే వేదికపై నిలబెట్టేందుకు పర్యాటకం ఎంతో దోహదం చేస్తుందని పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కేవలం రూ. 130 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు ఉండగా తెలంగాణ వచ్చాక ఈ రంగంపై సీఎం కే సీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, పర్యాటక రంగానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాయని తెలిపారు. టూరిజం ఫిల్మ్స్, మ్యూజియం ఆన్ విల్స్, గ్లాస్ నెగిటివ్స్‌తోపాటు ‘ట్రావెల్.. బీ సేఫ్’ మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. అలాగే హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ చిల్డ్రన్.. ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.



తెలంగాణ టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను స్వామిగౌడ్, చందూలాల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, పర్యాటకశాఖ డెరైక్టర్ సునీతా ఎం భగవత్, సాంస్కృతికశాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, విశాలాక్షి పాల్గొన్నారు.

 

బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా సదరన్ ట్రావెల్స్

రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా ప్రముఖ సంస్థ ‘సదరన్ ట్రావెల్స్’ ఈ ఏడాదికిగాను టూరిజం ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి చందూలాల్ ఈ అవార్డును అందజేశారు. అలాగే తాజ్ ఫలక్‌నుమా (హైదరాబాద్) ఫైవ్‌స్టార్ స్థాయిలో, హోటల్ దస్‌పల్లా (హైదరాబాద్) ఫోర్ స్టార్ స్థాయిలో, అలంకృత రిసార్ట్స్ (రంగారెడ్డి జిల్లా)తోపాటు ఫోర్ స్టార్ స్థాయిలో, ప్రత్యేక విభాగంలో అవార్డును గెలుచుకుంది. హోటల్-లాడ్జి త్రీస్టార్ స్థాయిలో శ్రీవేంకటేశ్వర లాడ్జి (హైదరాబాద్), మినర్వా గ్రాండ్ (సికింద్రాబాద్)కు, బెస్ట్ టూరిజం డెస్టినేషన్ ఇన్ హైదరాబాద్ కింద రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డులు లభించాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ తరఫున సంస్థ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అవార్డు అందుకున్నారు.

 

వివిధ అవార్డులు

బెస్ట్ టూరిజం డెస్టినేషన్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హరిత ఎకో టూరిజం రిసార్ట్స్ (కడెం), బెస్ట్ హరిత హోటల్‌గా హరిత కాకతీయ హోటల్ (వరంగల్), బెస్ట్ టూరిజం గైడ్‌గా జె.భాస్కర్‌రెడ్డి, బెస్ట్ టూరిజం ఫిల్మ్ కింద వెల్‌కమ్ టు తెలంగాణ తరఫున డి.సత్యనారాయణ, డిస్కవరీ ఆఫ్ తెలంగాణ కింద పి. చందర్ బడవత్, అతిథి దేవోభవ కింద అపోలో క్రేడిల్ ఆస్పత్రి(హైదరాబాద్)కి అవార్డు లభించింది. ఆ సంస్థ ప్రతినిధి డా.సునీల్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ రెస్టారెంట్ కింద కారంపూడి (హైదరాబాద్), బెస్ట్ రెస్టారెంట్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హోటల్ శ్వేత (కరీంనగర్) అవార్డులు పొందాయి. బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ అవార్డులను బి.పూర్ణచందర్ (కల్చర్), వి.శరత్ (హెరిటే జ్ విభాగంలో), ప్రిన్స్ (నేచర్ విభాగంలో) అందుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top