చలి.. పులి
సాక్షి, మహబూబ్నగర్: శీతాకాలం ప్రారంభంలోనే చలి వణికిస్తోంది. వారం పదిరోజులుగా తీవ్రమైన చలిగాలులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా నవంబర్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. గతేడాది ఇదే సమయంలో 21 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈసారి మాత్రం 17డిగ్రీలకే పరిమితమైంది.
నవంబర్లోనే చలి పరిస్థితి ఇలా ఉంటే జనవరిని తలుచుకుని కాయకష్టం చేసుకునేవారు హడలిపోతున్నారు. ఈ ఏడాది సరైన వర్షపాతం లేకపోవడంతో చలిగాలుల తీవ్రత అంతగా ఉండకపోవచ్చని భావించారు. కానీ గతేడాది కంటే అతితక్కువగా ఈ సారి నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గురువారం 17 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
పదిరోజుల క్రితం నిలోఫర్ తుపాన్ కారణంగా ఉష్ణోగ్రతల్లో కలిగిన వ్యత్యాసం అలాగే కొనసాగుతోంది. అక్టోబర్ 25తేదీన 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటే 26న ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గి 19డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదైంది. తాజాగా, బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీంతో రానున్న రెండు, మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు 15డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అత్యంత కనిష్టంగా 13.2 నమోదైన ఉష్ణోగ్రతలు.. నవంబర్లో కూడా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వృద్ధులు, పిల్లలపై ప్రభావం
చలిగాలుల ప్రభావం తీవ్రమవుతుండడంతో వృద్ధులు, చిన్నారులపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చర్మం పొడిబారి పగుళ్లబారిన పడడంతో పాటు అల ర్జీ, చర్మం ఎర్రబారడం, దురదలు వంటి శీతాకాలపు వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే చలి కాలంలో దో మల బెడద అధికమై విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. ఇక అస్త మా వ్యాధిగ్రస్తులు శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతమయ్యే అవకాశముంది. అలా గే హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు తామర, గజ్జి, తెల్లపొట్టువ్యాధి, అలర్జీ వంటి వ్యాపించే ప్రమాదం ఉంది.
నవంబర్లో నమోదైన ఉష్ణోగ్రతలు
(డిగ్రీల సెంటిగ్రేడ్లో)
తేదీ కనిష్టం గరిష్టం
17 19.5 34.3
18 21.0 34.2
19 22.0 33.1
20 21.1 31.8
21 19.3 33.7
22 18.5 33.7
23 18.5 32.5
24 19.5 33.5