మహిళపై అత్యాచారం చేసి చంపిన దుండగులు..

మహిళపై అత్యాచారం చేసి చంపిన దుండగులు.. - Sakshi


‘హత్యా’చారంతో కలకలం

మహిళపై అత్యాచారం చేసి చంపిన దుండగులు.. వికారాబాద్‌లో ఘటన

వివరాలు సేకరించిన ఏఎస్పీ వెంకటస్వామి


 

వికారాబాద్: ‘హత్యా’చారం ఘటనతో వికారాబాద్ పట్టణంలో కలకలం రేగింది. పట్టణం నడి బొడ్డున ఉన్న గాంధీ పార్క్‌లో దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాలు.. ధారూరు మండలం మైలారం అనుబంధ ముందరి తండాకు చెందిన రమావత్ చాప్లీబాయి(45) భర్త గతంలోనే చనిపోయాడు. ఆమె వికారాబాద్‌లో మేస్త్రీల వద్ద పనిచేసుకుంటూ పిల్లలను పోషించుకునేది.



బుధవారం ఇంట్లోంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా అదే తండాకు చెందిన పలువురు విద్యార్థులు వికారాబాద్‌లోని పలు కాలేజీలో చదువుతున్నారు. వారిలో కొందరు శుక్రవారం ఉదయం కాలక్షేపం కోసం వికారాబాద్‌లోని గాంధీపార్కుకు వెళ్లారు. విగతజీవిగా, నగ్నంగా పడి ఉన్న చాప్లీబాయి మృతదేహాన్ని గమనించి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణకు విషయం తెలిపారు. ఆయన ఫిర్యాదుతో జిల్లా ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి, సీఐ రవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.



మృతదేహానికి దగ్గరలో చాప్లీబాయికి సంబంధించిన దుస్తులు ఓ మూటలో కట్టి ఉన్నాయి. పోలీసు జాగిలం ఘటనా స్థలానికి సమీపంలోని మున్సిపల్ కార్యాలయం టౌన్‌ప్లానింగ్ విభాగంలోకి వెళ్లి.. అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది పార్కింగ్ షెడ్ వద్దకువెళ్లి ఆగిపోయింది. చాప్లీబాయిని తెలిసిన వ్యక్తులే పార్క్‌కు తీసుకొచ్చి అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చిన్న కొడుకు దరావత్ దేవేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top