ముగ్గురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధ తాళలేక వేర్వేరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టకు చెందిన రైతు నక్క కుమారస్వామి(40) కూతురి పెళ్లి కోసం, పంటల కోసం రూ. 4 లక్షల అప్పు చేశాడు. పంటలు ఎండిపోవడంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఈ నెల 5న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురానికి చెందిన కౌలు రైతు మిలుకూరి శశికుమార్(28) గతేడాది మిర్చి మీద రూ. 4 లక్షల వరకు అప్పులయ్యాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. సోమవారం పురుగులు మందు తాగాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వాలు తండాకు చెందిన మహిళా రైతు దీరవత్ చాందీ(50) పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేసింది. పొలం ఎండిపోవడంతో చాందీ మనస్తాపం చెంది గుళికల మందు తాగింది.