‘మా’లో తెలంగాణ, ఆంధ్ర విభేదాలు లేవు
‘మా’లో ఆంధ్ర, తెలంగాణ విభేదాలు లేవని, భవిష్యత్లో కూడా ఉండబోవని సినీనటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించిన క్రమంలో మాట్లాడారు.
హన్మకొండ కల్చరల్ : ‘మా’లో ఆంధ్ర, తెలంగాణ భేదాలు లేవని, భవిష్యత్లో కూడా ఉండబోవని సినీనటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేం ద్రప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి పార్లమెంటరీ సెక్రెటరీ వినయ్భాస్కర్, ‘మా’ కార్యదర్శులు విజయ్, పబ్బిని శ్రీనివాస్తో కలిసి చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజు శర్మ, అర్చకులు ప్రబాకరశర్మ, ప్రదీప్కుమార్శర్మ వారిని పట్టువస్త్రాలతో సన్మానించారు.
మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల సమయంలో మిత్రుడు దాస్యం వినయ్భాస్కర్ తనకు ఎంతో సహాయం చేశారన్నారు. అదే సమయంలో భద్రకాళి అమ్మవారి గురించి చెప్పారన్నారు. అందుకే ఎన్నికల అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ వాళ్లకి సినీ పరిశ్రమలో అన్యాయం జరిగితే అమ్మవారు తనను తొక్కేస్తుందని తెలుసన్నారు. భక్తులు రాజేంద్రప్రసాద్ను చూడడానికి జనం ఎగబడ్డారు. ధర్మకర్తలు రంగరాజ బలరాం, అడ్లూరి శ్రీనాథ్, మామిండ్ల నర్సింహులు, సునీల్కుమార్, సిబ్బంది కూచన హరినాథ్, అద్దంకి విజయ్, వెంకటయ్య, రాము, కృష్ణ, శ్యాంసుందర్ ఉన్నారు.