మహిళ మెడలో నగల చోరీ


మట్టెవాడ(వరంగల్): రైలు ప్రయాణికురాలి మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లికి చెందిన తాళ్ళ విజయలక్ష్మి(50) తన కుటుంబ సభ్యులతో కలిసి సికంద్రాబాద్ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి ఖమ్మం జిల్లా భద్రాచలంకు బయలుదేరింది. రైలు వరంగల్ జిల్లా కేసముద్రం స్టేషన్‌లో అర్ధరాత్రి సుమారు 2.00 గంటల సమయంలో కాసేపు ఆగి తిరిగి బయలుదేరింది. ఇంతలో కిటికీ పక్కనే కూర్చున్న విజయలక్ష్మి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగ గట్టిగా లాక్కొని పరారయ్యాడు. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనతో అయోమయానికి గురైన విజయలక్ష్మి బోరున విలపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top