కలెక్టర్ కారులో తరలించినా.. దక్కని ప్రాణాలు


రోడ్డు ప్రమాద బాధితుడి విషాదం

సమయానికి రాని 108




రామాయంపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక యువకుడిని సమయానికి ఎవరూ ఆదుకోలేదు. అటుగా వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్.. క్షతగాత్రుడిని తన కారులో చికిత్స నిమిత్తం తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో జరిగింది. ఎస్‌ఐ నాగార్జునగౌడ్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్ కుమార్ బైక్‌పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు.



రామాయంపేట పట్టణ శివారులో వీరి బైక్ ముందు వెళ్తున్న ఆటో వెనుక భాగాన్ని తాకి పట్టుతప్పి పడిపోయింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి పలువుర్ని సాయం కోరాడు. ఎవరూ స్పందించలేదు. అదే సమయంలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రామకృష్ణ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top