మద్యం ఎంత పని చేసింది...
చెన్నూర్: పట్టణంలోని జెండావాడకు చెందిన కొండమూరి నాగరాజు (35) అనే వ్యక్తి మద్యం మత్తులో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఏఎస్సై బెనర్జీ తెలిపారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. నాగరాజు మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన నాగరాజు అతడి భార్య లక్ష్మితో ఘర్షణ పడి ఇద్దరు పిల్లలతోసహా ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.
దీంతో లక్ష్మి భయంతో సమీపంలోని సోదరుని ఇంటికి వెళ్లింది. అర్ధరాత్రి 2గంట ప్రాంతంలో లక్ష్మి తన బంధువులతో ఇంటికి వెళ్లి చూడగా లోపలి గడియపెట్టి ఉంది. అనుమానం వచ్చిన బంధువులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నాగరాజు నాగరాజు దూలానికి ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.