బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు..
ఎంపీ పొంగులేటికి రైతుల ఫిర్యాదు
దమ్మపేట: నిబంధనల పేరుతో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని మండలంలోని పట్వారీగూడేనికి చెందిన పలువురు రైతులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆదివారం పట్వారీగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని రైతులు కలిశారు. పాత పహణీల ప్రకారం రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ - పహణీలు ఉంటేనే బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇస్తామంటున్నారని తెలిపారు. పట్వారిగూడెంలో తమకు వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ ఈ పహణీలు లేవని తెలిపారు. తమలాంటి వారికి బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. అందుకు స్పందించిన ఎంపీ దమ్మపేట తహశీల్దార్కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీని కలిసిన రైతుల్లో కోటగిరి మురళీ, కూరం చినముత్యాలు, కణితి వెంకటేశ్వరరావు, కోటగిరి సత్తిబాబు, రెడ్డిమళ్ల చిట్టి, కోటగిరి యుగంధర్, పఠాన్ మున్నా తదితరులు ఉన్నారు.