అలా పట్టుకున్నారు.. ఇలా వదిలేశారు..
అటవీశాఖలో అధికారుల తీరు..
వినాయక్నగర్, (నిజామాబాద్ అర్బన్) : కంచే చేను మేసిన సంఘటన ఇది.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న అటవీశాఖాధికారులు..అమ్యామ్యాలకు ఆశపడి అదనంగా జరిమానా కంటే ఎక్కువ డబ్బులు తీసుకుని వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 6వ తేదీన అర్ధరాత్రి మోస్రా సెక్షన్ పరిధిలో ఐదు ట్రాక్టర్లను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. అయితే అక్రమార్కులు అధికారులపై దాడి చేసి ఓ ట్రాక్టర్ను అదేసమయంలో తీసుకెళ్లారు.
దీంతో అధికారులు తిమ్మాపూర్ గ్రామస్తుల సహాయంతో మిగితా నాలుగు ట్రాక్టర్లను నిజామాబాద్ కార్యాలయానికి తరలించారు. ఈ నాలుగు ట్రాక్టర్లకు సుమారు.84వేలు విధించారు. అయితే ఈనెల 10న ఓ ప్రజాప్రతినిధి లాబీయింగ్ చేసినట్లు సమాచారం. అక్రమంగా తరలించే అటవీసంపదకు అధికారులు వివిధ సెక్షన్ల ప్రకారం సంపద విలువకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా జరిమానా వేయాలి. కాని ఇక్కడ ప్రజాప్రతినిధి తలదూర్చడంతో కేవలం వన్ ఇస్టు వన్ పద్ధతిలో జరిమానా విధించి అదనంగా రూ.16వేలు తీసుకుని ట్రాక్టర్లను వదిలేసినట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. అలాగే ఈ అటవీప్రాంతం వర్ని రేంజ్ పరిధిలోనిది. పట్టుకున్న ట్రాక్టర్లను వర్ని రేంజ్ కార్యాలయంలో ఉంచాలి. కాని వర్ని రేంజ్ కార్యాలయ కార్యకలాపాలన్నీ జిల్లా కేంద్రం నుంచే నిర్వహిస్తున్నారు. డివిజన్ జిల్లాస్థాయి కార్యాలయంతో పాటు సర్కిల్ కార్యాలయం ఇక్కడే ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కార్యాలయ వర్గాలే చర్చించుకుంటున్నాయి.