ఉగ్ర పేలుళ్లకు ‘చొప్పదండి సొమ్ము’

ఉగ్ర పేలుళ్లకు ‘చొప్పదండి సొమ్ము’ - Sakshi

  • పక్కా కుట్రపన్నిన జమాత్ అల్ ముజాహిదీన్

  •   బ్యాంకు దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్

  •   బుర్ద్వాన్ పేలుడు ఘటనలో దొరికిన నోట్ల కట్టలు

  •   ‘ఉగ్ర’ నగదుతో హైదరాబాద్, తిరుపతిలో స్థలాలు

  •   ఆర్థిక సహకారంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలకం

  •   లోతుగా ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు, ఈడీ

  •  

     సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఓ ముష్కరమూక తప్పించుకుంది... కొన్ని నెలలకే కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది... ఆ సొమ్మును వినియోగించి హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసింది... అదే సొమ్ముతో దీపావళి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పథక రచన కూడా చేసింది... అయితే బాంబుల తయారీకి యత్నిస్తుండగా జరిగిన పేలుడుతో ఈ కుట్ర మొత్తం బట్టబయలైంది. 

     

     ఈ నెల మొదటివారంలో పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఈ పేలుడు కేసు దర్యాప్తులో పలు కీలక కోణాలు వెలుగులోకి వచ్చాయి. జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్తగా ఏర్పడిన ఈ మాడ్యూల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై లోతుగా ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివీ...

     

     అబు ఫైజల్ నేతృత్వంలో జైల్ బ్రేక్...

     ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) మాడ్యూల్‌కు చెందిన ఇతడు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి గత ఏడాది అక్టోబర్ 1న మరో ఆరుగురితో(మహబూబ్, అంజాద్, అస్లం, ఎజాజ్, జకీర్, అబిద్) కలసి పరారయ్యాడు. ఇది జరిగిన నాలుగు గంటల్లోనే వారిలో ఒకడైన అబిద్ చిక్కగా మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనేక ప్రయత్నాల తరవాత డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్ చిక్కాడు. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురూ మరికొందరితో కలసి కొత్తగా జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా, బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ-బి, దేశవాళీ సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌లలోని ఉగ్రవాదులతో ఇది ఏర్పాటైంది. దీపావళి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్ అందుకు అవసరమైన సొమ్ము కోసం దోపిడీల బాటపట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు సానుభూతిపరుల సహకారంతో ఆ జిల్లాలో కొంతకాలం బస చేసిన ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. చివరకు చొప్పదండిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 1న పంజా విసిరారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్‌లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

     

     పేలుడుతో బయటపడిన భారీ కుట్ర...

     పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించింది. స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకడిగా గుర్తించారు. ఘటనా స్థలి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుపై చొప్పదండి ఎస్‌బీహెచ్ బ్యాంక్ లేబుళ్లు, ముద్రలు సైతం ఉన్నాయి. అదే ప్రాంతంలో 55 పేలని బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో సెప్టెంబర్ 12న ఇదే తరహా పేలుడు సంభవించింది. ఈ ఇంటిలో బాంబులు తయారు చేస్తున్నది ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న వారిగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అక్కడ-ఇక్కడ పేలని బాంబులు ఒకే మెకానిజంతో ఉండటంతో ఒకరి పనిగా స్పష్టమైంది.

     

     విచారణలో తిరుపతి, హైదరాబాద్ ప్రస్తావన..

     బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు అరెస్టు చేసిన నిందితుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళికి ఈ మాడ్యూల్ దేశవ్యాప్తంగా ఏకకాలంలో పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెల్లడైంది. ఈ ఉగ్రవాద సంస్థకు పరోక్షంగా ఆర్థిక సహకారం అందిస్తున్న వారిలో హైదరాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో నిధుల సమీకరణ చేస్తున్న ఓ మహిళ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థ సభ్యులు తలదాచుకోవడంతోపాటు బాంబులు తయారు చేయడానికి వినియోగించే విధంగా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌తో పాటు తిరుపతి పరిసరాల్లోనూ కొన్ని స్థలాల్ని కొనుగోలు చేయడానికి యత్నించి నట్లు వెలుగులోకి వచ్చింది. బుర్ద్వాన్-చొప్పదండి లింకు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు మూడు రోజుల క్రితం చొప్పదండి వెళ్లారు. స్థానిక పోలీసుల నుంచి ఆ కేసు వివరాలతో పాటు అప్పట్లో సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఆందోళనకరంగా మారిన ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీ లోతుగా ఆరా తీస్తున్నాయి. చొప్పదండి బ్యాంకు దోపిడీలో హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్, రజియా బీబీ, అలీ మా బీబీల పాత్రను అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు.

     
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top