చంపేసి.. గుంతలో పూడ్చేసి..
♦ వ్యక్తి దారుణ హత్య
♦ వికారాబాద్ మండలం కొత్రేపల్లిలో ఘటన
♦ వివరాలు సేకరించిన పోలీసులు
వికారాబాద్ రూరల్ : మొక్కజొన్న పొలానికి కాపలాగా వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని చంపేసి గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కొత్రేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి తిరుమలయ్య(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన కొత్రేపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తమ మొక్కజొన్న పంటకు కాపలాగా అదే గ్రామానికి చెందిన పరమేష్, సలీమొద్దీన్తో కలిసి వెళ్లాడు. అనంతరం అతడు తిరిగి రాలేదు.
కుటుంబీకులకు తిరుమలయ్య కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం పొలం వద్ద కరెంట్ స్తంభం కోసం తీసిన గుంతలో తిరుమలయ్య మృతదేహం కొంతభాగం కనిపించింది. చెత్తాచెదారం, మట్టితో కప్పబడి ఉంది. సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానికులతో మృతదేహాన్ని వెలికితీయించారు. తిరుమలయ్య ముఖంపై తీవ్రగాయాలు ఉన్నాయి. ఒక చెయ్యి, ఎడమ కాలు విరిగిపోయి ఉన్నాయి. ఘటనా స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి.
తాగిన మైకంలో గొడవజరిగి మాటామాట పెరిగి తిరుమలయ్య హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తిరుమలయ్యతో పాటు పంటకు కాపాలాగా వెళ్లిన వారే ఆయనను హత్య చేసి ఉండొచ్చని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి గతంలోనే చనిపోయింది. తిరుమలయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు మృతదేహానికి వికారాబాద్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. హతుడి తండ్రి కుమ్మరి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.