పది’లో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలి
తాండూరు: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలబెట్టాలని, ఇందుకనుగుణంగా విద్యార్థినీవిద్యార్థులు బాగా చదవాలని జెడ్పీ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఈసారి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో కృషిచేస్తే ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీవిద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, యాలాల ఎంపీపీ సాయిలుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహులు, కౌన్సిలర్లు ముక్తార్ అహ్మద్, నీరజ, పరిమళ, శోభారాణి, వాలి శాంత్కుమార్, ఉప విద్యాధికారి హరిశ్చందర్, ఎంఈఓ శివకుమార్, సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, కార్యదర్శి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ కట్కం వీరేందర్, పాఠశాల నిర్వాహకులు రమేష్చంద్రపండిత్, నర్సిరెడ్డి, జొన్నల బస్వరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.