గల్లాపెట్టెకు తాళం..

గల్లాపెట్టెకు తాళం.. - Sakshi


45 రోజులుగా ఫ్రీజింగ్

- నిలిచిన ‘కల్యాణలక్ష్మి, షాదిముబారక్’

- బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి

- పెండింగ్‌లో సుమారు రూ.10 కోట్ల చెల్లింపులు

- జిల్లా ట్రెజరీ ఆఫీస్ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

- ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ తప్పని తిప్పలు

నక్కలగుట్ట :
జిల్లా ఖజానా పెట్టెకు రాష్ట్ర ప్రభుత్వం తాళం వేసింది. జూన్ నుంచి తాత్కాలిక ఫ్రీజింగ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పథకాల అమలుకు బ్రేక్ పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల చెల్లింపులు నిలిచిపోయాయి.



ఫలితంగా లబ్ధిదారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, దళిత, గిరిజన అభివృద్ధి శాఖలు,  మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా ట్రెజరీలో చెల్లింపులకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లబ్ధిదారులకు దాదాపుగా రూ.9.92 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. సుమారు 45 రోజులు కావొస్తున్నా..  ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

 

‘కల్యాణలక్ష్మి’లో...

దళిత అభివృద్ధి శాఖ : జిల్లా దళిత అభిృృద్ధి శాఖ ద్వారా కల్యాణలకిృ్ష్మ పథకంలో మొత్తం 389 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైనా.. ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా మొదటి విడతలో 285, రెండో విడత 104 కల్యాణలక్ష్మి బిల్లులు దాఖలయ్యాయి. ఇవన్నీ ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు జిల్లా దళిత అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంృ ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

 

గిరిజన సంక్షేమశాఖ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో 410 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల విచారణ పూర్తయి, ట్రెజరీలో బిల్లులు దాఖలు చేసినా... ఫ్రీజింగ్ అమలు కారణంగా చెల్లింపులకు నోచుకోకుండా నిలిచిపోయాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి సీహెచ్.రాంమూర్తి తెలిపారు. రెండు శాఖలు కలిపి 799 మందికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

‘షాదిముబారక్’ అంతే..

ముస్లిం నిరుపేద కుటుంబాల్లోని అవివాహిత యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న షాదిముబారక్ పథకం పరిస్థితి కూడా కల్యాణలక్ష్మిలాగే తయారైంది. ఫ్రీజింగ్ కారణంగా  చెల్లింపులు నిలిచిపోయాయి. 2014-15లో షాదిముబారక్‌లో 333 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే.. 332 మందికి సర్కారు బిల్లులు మంజూరు చేసింది. 2015-16లో 570 మంది షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. 394 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 169 మంది లబ్దిదారులకు ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు చెల్లించలేదు. షాదిముబారక్ కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.86 లక్షలు పెండింగ్‌లో పడ్డాయి.

 

ఎస్సీ కార్పొరేషన్‌లో...

జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 400 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది.  ఫ్రీజింగ్ అమలు కారణంగా మరో 170 మంది లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించలేదు. లబ్ధిదారులకు సుమారు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

బీసీ కార్పొరేషన్‌లో...

జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన 830 మంది లబ్ధిదారులకు బ్యాంకులు రుణాల చెల్లిస్తే, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. నిధుల లేమి కారణంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడంతో అటు రుణాలు, ఇటు సబ్సిడీ విడుదల కాక లబ్ధిదారులు  బీసీ కార్యాలయంచుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్లు చెల్లించాలి.

 

ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా..

జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జీతాల బిల్లులు కూడా ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీలో నిలిపివేశారు. దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కలెక్టరేట్‌లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 1,500 మంది ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన వారికి సుమారు రూ.1.27 కోట్లు చెల్లించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top