ఎన్నికలకు ముందే యూ టర్న్!


 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘పంచ పాండవులంటే నాకు తెలియదా..! మంచం కోళ్ల వలే ముగ్గురే కదా..! అని రెండు చూపించి... ఒకటి రాయబోయి సున్నా పెట్టారట’. సెటైర్ పాతదే అయినా జిల్లాలో ఇప్పుడు టీడీపీకి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 10 అసెంబ్లీ సీట్లకు 10 సీట్లు మావే నని గొప్పలు చెప్పిన టీడీపీ.. ఎన్నికలకు ముందే కాడి ఎత్తేసింది. కార్యకర్తల మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ పునాదులనే పెకిలిస్తున్నాయి. జిల్లాలో టీడీపీకి కొంత బలమైన కేడ ర్ ఉన్న పటాన్‌చెరులోనే పార్టీ ఎదురీదుతోంది. ఆ పార్టీలో కీలక నేత శ్ర్రీనివాస్‌గౌడ్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.



 ఇంతకాలం టీడీపీకి అండగా నిలబడిన కొంత బీసీ వర్గం శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. జిన్నారం మండలానికి చెందిన మరో కీలక నేత చంద్రారెడ్డి ఒకటి రెండు రోజుల్లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీ అత్యంత గడ్డు పరిస్థితి  ఎదుర్కొనక తప్పదని పరిశీలకుల భావన. ఇక బీజేపీతో పొత్తులు కూడా కలిసి రావడంలేదు. బీజేపీ నుంచి పటాన్‌చెరు టికెట్ ఆశించి భంగపడ్డ వ్యాపారవేత్త అంజిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన రెబల్‌గా బరిలో నిలబడ్డారు. గతంలో ఉన్న  సేవా కార్యక్రమాలతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ 30 వేల మంది సెటిలర్స్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వైఎస్సార్ సీపీవైపు చూస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన సపాన్‌దేవ్ బలమైన నాయకుడు. కానీ ఆయన ఎంచుకున్న వేదిక సరైంది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.



 ఇక మెదక్ అసెంబ్లీలో బట్టి జగపతి చేరికతో టీడీపీ బలపడ్డట్టే అనిపించింది. కానీ ఎంతోసేపు నిలబడలేదు. టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనూ 30 ఏళ్ల తర్వాత టీడీపీ అందోల్ బరి నుంచి తప్పుకుంది. నిజానికి టీడీపీకి అందోల్ పెట్టని కోట. బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. పార్టీ అంతా దాదాపు ఖాళీ కావడంతో టీడీపీ పరువు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా అందోల్‌ను బీజేపీకి ఇచ్చింది. సంగారెడ్డిలో కూడా టీడీపీ శ్రేణులు కొన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.



 దుబ్బాకలోనే జత కలిసింది

 ఒక్క దుబ్బాకలోనే బీజేపీ, టీడీపీకి పొత్తు కలిసింది. పొత్తులో ఇక్కడి సీటును బీజేపీకి ఇచ్చారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీలో ఉన్నారు. పార్టీల మధ్య వైరం ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగతంగా టీడీపీ శ్రేణులను కలుపుకొని పోవడంతో ఆయనకు కలిసి వస్తుందనే చెప్పాలి.  మిత్రపక్షం తరుపున రఘునందన్ గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top