తెలుగు విద్యార్థిపై కాలిఫోర్నియాలో కాల్పులు!
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు ఆదివారం కాలిఫోర్నియాలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముబీన్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ అహ్మద్ 2015 ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఉంటూ ఎంబీఏ చదువుతున్నాడు. అదే సమయంలో ఓ ప్రైవేటు దుకాణంలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు.
గత ఆదివారం అతను పనిచేస్తున్న దుకాణంలోకి కొంతమంది నల్లజాతీయులు వచ్చారు. ఈ సందర్భంగా ముబీన్తో వారికి వాగ్వాదం జరిగిందని, దీంతో బరితెగించిన వారు ముబీన్పై కాల్పులు జరిపారని అతని తండ్రి ముజీబ్ అహ్మద్ తెలిపారు. ముబీన్ను వెంటనే క్యాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్కు తరలించి.. ప్రత్యేక శస్త్రచికిత్స జరిపారని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు ముజీబ్ వివరించారు. ఆస్పత్రిలో ఉన్న ముబీన్ను చూసేందుకు వీలుగా అమెరికాకు వెళ్లేందుకు తమకు సాయం అందజేయాలని ముబీన్ కుటుంబం బుధవారం మంత్రి హరీశ్రావును ఆశ్రయించింది.
సంబంధిత వార్తలు