విమోచనం.. రణరంగం

విమోచనం.. రణరంగం - Sakshi


గోల్కొండపై జెండా ఎగురవేసేందుకు బీజేపీ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ఉద్రిక్తత, తోపులాట... లాఠీలు ఝుళిపించిన ఖాకీలు

లంగర్‌హౌస్‌లో రోడ్డుపైనే బైఠాయించిన నేతలు

కిషన్‌రెడ్డితో పాటు కీలక నేతల అరెస్టు

ఉద్యవూలను అణచడానికి ప్రభుత్వం కుట్ర : కిషన్‌రెడ్డి

చరిత్రహీనులుగా మిగిలిపోతారు : ఎంపీ దత్తాత్రేయు




తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం బీజేపీ శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీ మార్గమధ్యలో రణరంగంగా మారింది. లంగర్‌హౌస్ వద్ద  పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో తోపులాట, వాగ్వివాదాల నడుమ పోలీసులు లాఠీలు ఝుళి పించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బాపూఘాట్ వద్ద రాంలీలా మైదానం నుంచి బీజేపీ శ్రేణులు పెద్దెత్తున అగ్రనాయకుల ఆధ్వర్యంలో దండుగా బయలుదేరారు. లంగర్‌హౌస్ రాంలీలా మైదానంలో సభ నిర్వహించిన అనంతరం 11 గంటలకు ర్యాలీ కదిలింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ముందు నడువగా వాహనంపై నుంచి బండారు దత్తాత్రేయ, నాగం జనార్ధన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, డాక్టర్ లక్ష్మణ్‌లు మైక్‌లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకుసాగారు. ర్యాలీ లంగర్‌హౌస్ ఫై ్లఓవర్ చౌరస్తా వద్దకు రాగానే గోల్కొండ కోట వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పురావస్తు శాఖ నుంచి అనుమతి లేద ని చెప్పడంతో కార్యకర్తలు పోలీసులను తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో డీసీపీ సత్యనారాయణతో పాటు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జి, తోపులాటలో ఆర్కెపురానికి చెందిన శేఖర్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోగా, ప్రమోద్ అనే యువకుని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇతర నాయకులతో కలసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా  నినాదాలు హోరెత్తాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు వినిపించకుండా జనరేటర్‌ను ఆఫ్ చేసి మైక్ పనిచేయకుండా చేశారు పోలీసులు. అనంతరం ధర్నాలో కూర్చున్నవారిని బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు.  



‘కోట’ వద్ద హడావుడి....



తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరవేస్తామని బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. కోటలోకి వెళ్లే దారులన్నింటినీ మూసివేసి ఆ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసుల దృష్టి మళ్లించేందుకు రకరకాల ఎత్తులు వేశారు. అయితే... పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కార్యకర్తలను అడ్డుకొని అదుపులోకి తీసుకొన్నారు. కొందరు యువకులు జట్లు జట్లుగా గల్లీల్లోంచి దూసుకువచ్చి   భారత్ మాతాకీ జై... అంటూ నినదిస్తూ కోట ముందు ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అప్రమత్తమై అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొందరు తప్పించుకొని కోటలోకి ప్రవేశించారు. పోలీసులు వారిని వెంటాడి అరెస్ట్ చేశారు.  

 సత్తా చాటాం...

 దిగ్భందాలను ఛేదిస్తూ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో బీజేపీ తన సత్తాచాటిందని ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, టోలీచౌకి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పోలీసుల వలయూన్ని దాటుకొని కోటలోకి ప్రవేశించి జెండా ఎగురవేశారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ జెండా ఎగురవేసిన చోటే వీరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో వీరున్న విషయాన్ని తెలుసుకున్న ఎంపీ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణలను అభినందించారు.  



ఉద్యమాలను అణచడానికి కుట్ర : కిషన్‌రెడ్డి



ఉద్యమ పార్టీగా పోరాటాలు చేసి విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసేందుకు యత్నిస్తోందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు వెళ్తున్న కిషన్‌రెడ్డి, ఇతర వుుఖ్య నాయుకులతోపాటు సుమారు 400 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి గోషామహల్ పోలీస్‌స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, విద్యార్థులపై లాఠీచార్జిలు చేసి ప్రభుత్వం ఉద్యమాలను నియంత్రించేందుకు యత్నిస్తోందన్నారు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు ఎగిసిపడుతుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. విమోచన దినోత్సవ వేడుకలను ఊరూరా తీసుకువెళ్లి నిజాంల పాలనలో జరిగిన దురాగతాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. శాసన సభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత దాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరె స్టుచేయడం శోఛనీయమన్నారు. మతోన్మాద మజ్లీస్ వత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై బీజేపీ నాయకులు, కార్యకర్తలను వదిలిపెట్టారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్‌యాదవ్, మెట్టు వైకుంఠం, ఆలె జితేంద్ర, కన్నె ఉమాదేవి, సహదేవ్‌యాదవ్, రంజనాగోయల్, మాజీ కార్పొరేటర్ ఎన్.సాంబశివగౌడ్, ఎల్‌బినగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆకుల రమేష్‌గౌడ్, బీజేపీ నాయకులు జి.ఆనంద్‌గౌడ్, జిగ్నేష్‌జోషి, కన్నె రమేష్‌యాదవ్, గోపాల్‌జీ, అచ్చిని రమేష్, బాల్‌రాజ్,కె.శ్రీనివాస్,బ్రహ్మచారి, అరుణజ్యోతి, విజి తారెడ్డి, ఉప్పల శారదలతోపాటు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



చరిత్ర హీనులుగా మిగిలిపోతారు:  ఎంపీ దత్తాత్రేయు



బాపూఘాట్ వద్ద రాంలీలా మైదానంలో ర్యాలీని ప్రారంభించే వుుందు జరిగిన సభలో ఎంపీ దత్తాత్రేయు వూట్లాడుతూ టీఆర్‌ఎస్ తీరుపై వుండిపడ్డారు. ‘చరిత్రను అపహాస్యం చేసేవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. చరిత్రకు మతానికి సంబంధం లేదు. భారతదేశంలో జరి గిన పోరాటాన్ని మీరు గౌరవించరా..? రజాకార్ల మనస్తత్వం కలిగిన ఎంఐఎంతో టీఆర్‌ఎస్ జత కట్టింది. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించేందుకు  ముఖ్యమంత్రి నిరాకరించారు’ అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని కేసీఆర్‌ను తాము అడిగితే... ఆయ న నుంచి సమాధానమే లేదని తెలిపారు. తెలంగాణ అచ్చమైన, స్వచ్ఛమైన ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తుందం టే సీఎం నిజ స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి రాగానే స్వార్థంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం  మతతత్వ శక్తుల వత్తిడికి లోబడి వేడుకల పట్ల పక్షపాతం వహించారని,  దీన్ని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

చరిత్రను విస్మరించే వీల్లేదు : చంద్రబాబు
http://img.sakshi.net/images/cms/2014-09/81410982931_Unknown.jpg

 

సెప్టెంబర్ 17భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ విలీ నం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, చరిత్రను విస్మరించేందుకు వీల్లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించి విలీన దినోత్సావాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 బిడ్డా... రేపు మాదే



‘గోల్కొండ కోటపై జెండా ఎగరేసేందుకు వెళుతున్న బీజేపీ శ్రేణులను అరెస్టు చేస్తే  బిడ్డా... రేపు మా ప్రభుత్వం వస్తది, అప్పుడు మీపై చర్యలుంటయ్’ అంటూ బీజేపీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి వేదికపై నుంచి కేసీఆర్‌కు హెచ్చరికలు చేశారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని, లేదంటే ఎంతకైనా తెగిస్తా.. పోరాడుతా ? అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘నీ శరీరంలో చీము నెత్తురు ఉందా... లేక మొత్తం దేంతోనైనా నిండిపోయిందా..? ఆరోజేమో తెగి స్తానన్నావ్. ఈ రోజు కాళ్లు బార్లా తెరుచుకొని పడుకొన్నవ్. మహారాష్ట్ర , కర్ణాటకల్లో ఈ రోజు పండుగ చేసుకొంటుంటే... ఇక్కడేమో అడ్డుకున్నవ్. చరిత్ర నిన్ను క్షమించదు’ అని నాగం  ఘాటుగా విమర్శించారు.

 

 జిల్లాల్లో విమోచనంhttp://img.sakshi.net/images/cms/2014-09/51410983008_Unknown.jpg



నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో బుధవారం విమోచనదినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిం చగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిజామాబాద్‌లో ఏబీ వీపీ, టీజీవీపీ, బీజేవైఎం నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), టీఆర్‌ఎస్, ఏబీవీపీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జాతీయ జెండాలను పట్టుకొని బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. కరీంనగర్ జిల్లాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలపై బీజేపీ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top