బోనాలకు రూ. 9.98కోట్లు విడుదల


హైదరాబాద్ : బోనాల పండుగ సందర్భంగా భక్తులు హాజరయ్యే ఆయా ఆలయాల వద్ద తగిన సదుపాయాలు, ప్రత్యేక ఏర్పాట్ల కోసం శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమీషనర్ సోమేశ్‌కుమార్ రూ. 9.98 కోట్లు విడుదల చేశారు. వీటితో మొత్తం 345 పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ఆయా ఆలయాల వద్ద అలంకరణ, రహదారుల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. పాతబస్తీలోని పలు ఆలయాల నుంచి ఊరేగింపు జరిగే మార్గాల్లో లైటింగ్ ఏర్పాట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.



లైటింగ్ ఏర్పాట్లకు సౌత్‌జోన్‌కు రూ. 15.80 లక్షలు, వెస్ట్‌జోన్‌కు రూ. 15.26 లక్షలు, సెంట్రల్‌జోన్‌కు రూ. 20.05 లక్షలు కేటాయించారు. 2 వ తేదీ ఉదయం జరుగనున్న ఘటాల ఊరేగింపు మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల జాతర కమిటీతో శుక్రవారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top