ఆలయాల్లో తెలంగాణ అవతరణోత్సవాలు
హైదరాబాద్: జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అర్చకులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిది వేల ఆలయాల్లో విద్యుత్ దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ, ప్రసాద పంపిణీ చేపట్టాలన్నారు.
10 జిల్లాల్లో 700 మంది వేదపండితులను, 700 మంది అర్చకులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయని తెలిపారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ. 2600 నుంచి రూ.6 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు. సమావేశంలో భాగ్యనగర్, రంగారెడ్డి అర్చక సమాఖ్య అధ్యక్షులు రాజేశ్వర్శర్మ, ఆర్.శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.