తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పాటు
పొన్నాల, జానా సహా 8 మందికి చోటు
ఎస్టీలకు, ఐదు జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య సహా మొత్తం 8 మంది సభ్యులకు ఇందులో చోటు కల్పిస్తూ రూపొందించిన జాబి తాకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఆమోదం తెలిపారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది జాబితాను విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య, అసెంబ్లీ, శాసనమండలి లో విపక్ష నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్ ఉపనేతలు జె.గీతారెడ్డి, షబ్బీర్ అలీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, డి.శ్రీధర్బాబు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జాబి తాలో శ్రీధర్ బాబు పేరు పక్కన కార్యదర్శి అని ప్రచురితమైంది. కమిటీ కార్యదర్శిగా ఉన్నారా? లేక పీసీసీ కార్యదర్శి అని ప్రచురించారా అన్నది స్పష్టం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు కమిటీలో చోటు కల్పించలేదు.
అలాగే, ఎస్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కకపోగా, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇద్దరేసి నేతల చొప్పున కమిటీలో అవకాశం కల్పించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడం, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం రూపొందించేందుకు సమన్వయ కమిటీని ఏర్పా టు చేశారు. సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నేతల మధ్య ఐకమత్యం కోసం దీనిని ఏర్పాటు చేశారు. కాగా ఈ కమిటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ైచైర్మన్గా, పీసీసీ అధ్యక్షుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. అయితే, తాజాగా ప్రకటించిన సమన్వయ కమిటీలో దిగ్విజయ్సింగ్ పేరు లేకపోవడం గమనార్హం.
పార్టీలోకి వనమా..
కాంగ్రెస్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా నేత వనమా వెంకటేశ్వరరావును తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు జనార్దన్ ద్వివే ది తెలిపారు. వనమాను పార్టీలోకి తీసుకోవాలని ఆ జిల్లా నేతల సూచనను పార్టీ అధ్యక్షురా లు ఆమోదించారని ద్వివేదీ తెలిపారు.ట