‘వైషమ్యాలు రేపుతున్న కేసీఆర్’
కొల్లాపూర్ : రాష్ట్రంలోప్రజల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ వైషమ్యాలను రేపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. శుక్రవారం ఆయన కొల్లాపూర్లో పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించి విద్యార్థులకు, పేదలకు మధ్య ఘర్షణలు రేపేందుకు ముఖ్యమంత్రి కుట్రపన్నారని, యూనివర్సిటీ భూముల్లోనే ఇళ్ల నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు.
పేదలకు ఇళ్లు కట్టించేందుకు హైదరాబాద్లో భూస్వాముల నుంచి భూములు కొని కట్టించాలని సూచించారు. టీడీపీ హయాంలో చదువు, అంటరానితన నిర్మూలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి యూనివర్సిటీల పరిరక్షణకు కృషిచేయటం జరిగిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి, శివానందం, చంద్రశేఖర్శెట్టి, పస్పుల నర్సింహ, కలమంద శేఖర్, కుర్మయ్య, రాముడు పాల్గొన్నారు.