పాల్వంచలో స్విడ్జర్లాండ్ లొకేషన్లు

పాల్వంచలో స్విడ్జర్లాండ్ లొకేషన్లు


- అందరి సహకారంతో ‘ఆంధ్రాపోరి’ సినిమా పూర్తి

- మే 15న సినిమా విడుదల చేస్తాం

- చిత్ర దర్శకులు రాజ్ ముదిరాజు వెల్లడి


పాల్వంచ: పాల్వంచలో కేరళ, స్విడ్జర్లాండ్ వంటి ప్రదేశాల్లో దొరికే లొకేషన్లు ఉన్నాయని ‘ఆంధ్రాపోరి’ చిత్ర దర్శకులు రాజ్ ముదిరాజు అన్నారు. సోమవారం స్థానిక కేటీపీఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.



అందరి సహకారంతో పాల్వంచలో ఆంధ్రాపోరి సినిమా షూటింగ్ అద్భుత రీతిలో పూర్తి చేశామని అన్నారు. మంచి కథాంశంతో దర్శకుడు పూర్తి జగన్నాథ్‌ను కలిసి వివరించినప్పుడు తన తనయుడు ఆకాశ్‌పూరితోనే సినిమా తీసేందుకు అంగీకరించారని, ఆ తరువాత ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ తమను ప్రోత్సహిస్తూ నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు ముది రాజు తెలిపారు. అనంతరం పాల్వంచను ఎంచుకుని 32 రోజులపాటు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు.



షూటింగ్‌కు ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ అనంతరం మే 15న విడుదల చేస్తామన్నారు. జిల్లాలో అనేకమంది కళాకారులు ఉన్నారని, వారి ప్రతిభను వెలికితీసేందుకు చిత్రపరిశ్రమ ముందుకు రావాలని, మున్ముందు మరిన్ని చిత్రాలు ఇక్కడ రూపొందించబడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 17 ఏళ్ల వయసు ఉన్న ఆకాశ్‌పూరి, ఝాన్సీకారాణి సీరియల్ నటి ఉల్కాగుప్తా అద్భుతంగా నటించారని, సంగీ తాన్ని జోషిబట్ల అందించారన్నారు. అనంతరం హీరో ఆకాశ్‌పూరి మాట్లాడుతూ తాను హీరోగా నటించిన ఆంధ్రాపోరిని విజయవంతం చేసి తనను మరింత ప్రోత్సహించాలని కోరారు.

 

పాల్వంచకు ఖ్యాతి

ఆంధ్రాపోరి సినిమా షూటింగ్ మొత్తం పాల్వంచలో జరుపుకోవడం శుభపరిణామమని కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణ అన్నారు. అతిపెద్ద బ్యానర్‌లో సినిమా మొత్తాన్ని ఇక్కడే చిత్రించడం వల్ల పాల్వంచ ఖ్యాతి మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో మరిన్ని చిత్రాలు నిర్మించే అవకాశం కలుగుతుందన్నారు. పాల్వంచలోనే చదువుకుని సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక చిత్రాలను నిర్మిస్తున్న దర్శకుడు రాజ్‌ను అభినందించారు.



అనంతరం చిత్ర యూనిట్‌ను ఘనంగా సన్మానించారు. సినీ యూనిట్ సీఈని సన్మానించారు.  కార్యక్రమంలో సీఐ షుకూర్, కో-డెరైక్టర్ రమేష్, కెమెరామెన్ ప్రవీణ్ వనమాలి, ప్రొడక్షన్ డిజైనర్ మహేష్, ప్రసాద్ ప్రొడక్షన్ పీఆర్‌వో నాయుడు, మానస అకాడమీ సంస్థ డెరైక్టర్ ప్రభుకుమార్, కేటీపీఎస్ ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top