26న సుష్మా రాక

26న సుష్మా రాక - Sakshi


హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్లమెంటరీ  నాయకురాలు సుష్మాస్వరాజ్ ఈ నెల 26వ తేదీన జిల్లాకు రానున్నారు. హన్మకొండలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో ఆమె పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ పార్లమెంట్‌తోపాటు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కమల దళం పోటీలో ఉంది.



వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు బరిలో ఉన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జనగామ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ బీజేపీ పోటీ చేస్తుండగా... జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.



వరంగల్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఈ స్థానాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందుగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. అయితే ఆయన కరీంనగర్ పర్యటన ఇదివరకే ఖరారైంది. దీంతో వరంగల్ కు నరేంద్రమోడీ రాని పరిస్థితి నెలకొంది.



ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గట్టిగా వాణి వినిపించి.. తెలంగాణ అడపడుచుగా పేరు తెచ్చుకొన్న సుష్మాస్వరాజ్‌ను వరంగల్ ప్రచారానికి నేతలు ఆహ్వానించారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లలో మునిగిపోయారు. జనసమీకరణ, సభాస్థలిపై దృష్టి కేంద్రీకరించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top