సింగరేణిలో సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌

సింగరేణిలో సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌ - Sakshi


- జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ప్లాంటుకు అనుమతి

- డీపీఆర్‌ సిద్ధం చేస్తున్న సింగరేణి సంస్థ

- 2015 మార్చి 3నే మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం

- ఇక 2,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా ఎస్టీపీపీ




సాక్షి, మంచిర్యాల: బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా కొనసాగుతూ విద్యుత్‌ ఉత్పత్తిలోకి అడుగుపెట్టిన సింగరేణి సంస్థ మరో మైలురాయిని చేరుకోబోతుంది. జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంటు (ఎస్టీపీపీ) మూడో యూనిట్‌ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించినట్లు సమాచారం. తద్వారా ఎస్టీపీపీ విద్యుత్‌ ఉత్పత్తి 2,000 మెగావాట్లకు చేరుకోబోతుంది. తొలుత 1,800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి (ఒక్కో యూనిట్‌లో 600 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు) లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా 1,200 మెగా యూనిట్ల ఉత్పత్తి సాగుతోంది. 100 శాతం పీఎల్‌ఎఫ్‌ (పవర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో ఉత్పత్తి సాగిస్తున్న ఎస్టీపీపీకి 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగితే సింగరేణి మరో రికార్డును సొంతం చేసుకున్నట్టే. తద్వారా దేశంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే çసూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో ఎస్టీపీపీ కూడా చేరనుంది.



800 మెగావాట్లతో పవర్‌ప్లాంట్‌

జైపూర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంటు (ఎస్టీపీపీ) విస్తరణలో భాగంగా 2015మార్చి 3న మూడో యూనిట్‌ ప్లాంటుకు సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. మూడో ప్లాంటును రూ.3,570కోట్ల వ్యయం తో మరో 600మెగా వాట్లతోనే థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పర్యావరణ ఇబ్బం దులు తలెత్తకుండా చిన్నచిన్న పవర్‌ ప్లాంట్ల ఏర్పాటును నిరోధిస్తూ 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్‌ పవర్‌ప్లాంట్లను నిర్మించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలో ఇప్పటికే సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలు పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యా యి. అందులో భాగంగానే సింగరేణి సంస్థ నిర్మించే మూడో దశ పవర్‌ప్లాంట్‌ సామర్థ్యం 800 మెగావాట్లకు అనుమతి లభించినట్లు సమాచారం.



కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో మూడో యూనిట్‌ డీపీఆర్‌(డిటెల్‌ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ముందస్తు ఆలోచనతో గతంలోనే థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం 2200 ఎకరాల భూసే కరణ చేపట్టింది. దీంతో మూడో యూనిట్‌ నిర్మాణం సులభతరం కానుంది. రెండు యూ నిట్ల నిర్మాణాలతో పోల్చితే మూడో యూనిట్‌ నిర్మాణం వ్యయం తగ్గనుంది. విద్యుత్‌ ఉత్పత్తి కి బొగ్గు, నీరు అవసరం కాగా, ఈ రెండు వనరులు ఎస్టీపీపీకి అందుబాటులో ఉన్నాయి. బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్‌ నిర్మాణం కూడా ప్రారంభించ బోతున్నారు. ఇక షెట్‌పల్లి గోదావరి నది నుంచి టీఎంసీ, కోటపల్లి మండలం దేవులవాడ నుంచి రెండు టీఎంసీల నీరు తరలిస్తున్నా రు. పవర్‌ప్లాంటులో రెండ్లు రిజర్వాయర్లు నిర్మించారు. బొగ్గు, నీరు అందుబాటులో ఉండడం ఖర్చు తగ్గడంతో పాటు సులభతరం కానుంది.



మొదటి సారిగా 2011లో..

127 ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తితో దేశంలోని థర్మల్‌ విద్యుత్తు, పారిశ్రామిక రంగానికి ఆయువుప ట్టుగా నిలిచిన సింగరేణి సంస్థ 2011లో జైపూర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్లాంట్ల ద్వారా మొదటిసారిగా విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టింది. రూ.8,250 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,200 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల ఈ ప్లాంట్లను ఆగస్టు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిం చారు. ఈ రెండు ప్లాంట్ల నుంచి పూర్తిస్థాయి పవర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌తో 100 శాతం విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండడం రికార్డు. ఇప్పటి వరకు 4,246 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఎస్టీపీపీ ద్వారా ఉత్పత్తి చేయగా, అందులో 3,941 మిలియన్‌ యూనిట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకే వినియోగించినట్లు సంస్థ చెబుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top