సబ్సిడీపై సోలార్ కిట్లు

సబ్సిడీపై సోలార్ కిట్లు - Sakshi


 బాన్సువాడరూరల్ : వచ్చే మార్చి నాటికి తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో 20 వేల పంపుసెట్లకు సబ్సిడీపై సోలార్ కిట్‌లు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ. 200 కోట్లు విడుదల చేస్తుందన్నారు. శనివారం ఆయన పోచారం గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో పంపుసెట్‌కు అమర్చిన సోలార్‌కిట్ పనితీరును పరిశీలించారు.అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సుమారు  50 లక్షల ఎకరాలు పంపుసెట్ల కింద సాగవుతున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కోతలను అధిగమించడానికి కృతనిశ్చయంతో  ఉన్నారన్నారు. రానున్న మూడేళ్లలో మరో 20 వేల మెగావాట్‌ల విద్యుదుత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు.



ఎన్‌టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్, జెన్‌కో ద్వారా 6 వేల మెగావాట్, సొలార్ ద్వారా 2వేల మెగావాట్, చత్తీస్‌ఘడ్ నుంచి కొంత కొనుగోలు, ఉత్పత్తికి ప్రణాళిక వేశారన్నారు. ప్రస్తుతం తన  సొంత పొలంలో బిగించిన సొలార్ సెట్ పనితీరు బాగుందని దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించామన్నారు. సొలార్‌సెట్‌కు రూ. 3 లక్షల వరకు ఖర్చు వస్తే అందులో రూ. లక్ష రాష్ట్రప్రభుత్వం, మరో లక్ష కేంద్రం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మిగిలిన డబ్బులు రైతులు భరించాల్సి ఉంటుందన్నారు. ఎవరు తక్కువకు టెండర్ చేస్తే వారి కంపెనీ సొలా ర్ కిట్‌లను అందిస్తామన్నారు.



సోలార్ ద్వారా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపు నీరుపోసే అవకాశం ఉంటుందన్నా రు. రాత్రిపూట ఇక కరెంట్‌తో పనివుండదని తద్వా రా పాముకాట్లతో, విద్యుత్‌ఘాతంతో రైతులు మృతిచెందే ప్రమాదాలు చోటు చేసుకోవన్నారు. రైతులు సొలార్ విధానాన్ని పరిశీలించి ముందుకు వస్తే ప్రభుత్వం సహకరించాడానికి సిద్ధంగా ఉందన్నారు. మంత్రి వెంట ఆర్టీఓ  శ్యాం ప్రసాద్‌లాల్, పోచారం సర్పంచ్ అంజవ్వ, ఎంపీటీసీ విజయ్‌గౌడ్, నాయకులు ఎర్వాల కృష్ణారెడ్డి, ఎజాస్, అంజిరెడ్డి, గంగాధర్, గోపాల్‌రెడ్డి, సాయిరెడ్డి,తకొయ్యగుట్ట శ్రీధర్, శ్రీనివాస్‌డ్డి ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top