విద్యార్థిని ప్రాణం తీసిన చున్నీ

విద్యార్థిని ప్రాణం తీసిన చున్నీ - Sakshi


నిర్మల్ : మెడకు వేసుకున్న చున్నీ ఓ విద్యార్థినిని మృత్యు ఒడికి నెట్టింది. మోటార్‌సైకిల్ వెళ్తుండగా చక్రంలో చిక్కుకున్న చున్నీని తీయడం కోసం దిగగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్‌పేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన బోండ్ల సంధ్యారాణి(18) నిర్మల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.

 

 అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు బుధవారం వచ్చింది. పరీక్ష రాసి సాయంత్రం తండ్రి నారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరింది. నిర్మల్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విశ్వనాథ్‌పేట్ సమీపంలో సంధ్యారాణి చున్నీ మోటార్‌సైకిల్‌లో చిక్కుకుంది. నారాయణ ద్విచక్రవాహనాన్ని నిలుపగా.. సంధ్యారాణికి కిందికి దిగింది. నారాయణ మోటార్‌సైకిల్‌ను రోడ్డు పక్కకు తీస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ సంధ్యారాణిని ఢీకొట్టింది. లారీ చక్రం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మెదడు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి.. ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top