పాఠశాలలో విద్యార్థిని మృతి
వికారాబాద్ : అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం కొత్తగడిలోని సమీకృత సంక్షేమ బాలికల పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సంక్షేమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మధురవేణి(14) అనారోగ్యం కారణంగా మృతిచెందిందని సోమవారం పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అయితే తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, పాఠశాల సిబ్బంది తమకు సరైన సమాచారం అందించకుండా మోసం చేసారని నిరసిస్తూ.. బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్లో అపరిశుభ్రత కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని వారు ఆరోపించారు.