వేధింపులకు విద్యార్థి ఆత్మహత్య
గరిడేపల్లి : గ్రామ యువకులు చేసిన వే ధింపులు తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం గరిడేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గుండు రాజశేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పుల్లమ్మ యేనే ప్రాంతానికి చెందిన బెల్లంకొండ గోపి (18) నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గోపి ఖాళీ సమయంలో సుతారి పనులకు వెళుతుండగా గరిడేపల్లి, నేరేడుచర్లకు చెందిన కొంతమంది యువకులు గోపిని తరచూ వేధిస్తూ మనస్తాపానికి గురిచేసేవారు. రెండు రోజులక్రితం గోపిని కొందరు యువకులు కొడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో వారి వేధింపులు తట్టుకోలేక గోపి బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యతో కలత చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితుడు రోడ్డుపై మృతదేహంతో బైఠాంచేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎస్ఐ జోక్యం చేసుకొని నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతోపాటు ఆరుగురిపై కేసు నమోదు చేయడంతో వారు శాంతించారు. గోపి అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.