చిన్న రాష్ట్రాలతోనే ప్రజాస్వామ్యానికి బలం
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
డిచ్పల్లి, న్యూస్లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులతో సహా బలపడేందుకు చిన్నరాష్ట్రాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలంగాణజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు-అంబేద్కర్ అభిప్రాయాలు-సమకాలీన రాజకీయా ల్లో ఆవశ్యకత’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను విశ్లేషించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 చరచల్లో ఆయన కీలక భూమిక పోషించారని తెలిపారు. ఒక భాష మాట్లాడే వారంతో ఒకే రాష్ట్రంలోనే ఉండాలనే నియమం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఏ ప్రాంతం కూడా రాజకీయ గుత్తాధిపత్యాన్ని సాగించరాదనే ఉద్దేశంతో ఉత్తర భారత దేశంలోని పెద్ద రాష్ట్రాల్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని అంబేద్కర్ సూచించారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను మూడు రాష్ట్రాలుగా, బీహార్ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని కోరారని తెలిపారు. మహారాష్ట్ర ప్రాంతానికే బొంబాయి నగరం రాజధాని కావాలని అంబేద్కర్ గట్టిగా కోరిన విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి ‘ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పేరుతో అంబేద్కర్ ఒక గ్రంథాన్ని రచించారని అన్నారు. తన జీవితమంతా ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసమే కృషి చేశారని కోదండరాం కితాబిచ్చారు. ప్రాంతీయ ఉద్యమాలను సంకుచిత రాజకీయ దృష్టితో కాకుండా, విశాల సామాజిక ఆకాంక్షలుగా గుర్తించాలన్నారు. సదస్సులో తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్, వర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కనకయ్య, ఆర్ట్స్ విభాగం డీన్ ధర్మరాజు, జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్శర్మ, వర్సిటీ ఎస్సీ-ఎస్టీ సెల్ డైరక్టర్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.