శ్రీశైలం సొరంగం పూర్తి చేయాలి


 మిర్యాలగూడ : శ్రీశైలం సొరంగ మార్గాన్ని త్వరగా పూర్తిచేసి జిల్లాకు సాగునీటిని అందించాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం స్థానిక ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.4500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చెల్లింపులు నిలిచిపోవడం వల్ల సొరంగం పనులు ఆగిపోయాయని, నిధులు విడుదల చేసి 2015-16 వరకు పూర్తిచేయాలన్నారు. శ్రీశైలం సొరం గం 53 కిలోమీటర్లకు ఇప్పటివరకు 31కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలన్నారు.

 

 ఈ ప్రాజెక్టు జిల్లాలో ఏఎమ్మార్పీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదే విధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణకు ఏదో మంచి చేయాలని తపన ఉన్నప్పటికీ మంత్రులకు శాఖలపై పట్టులేదన్నారు. ఉద్యమ కాలంలో అన్ని రాజకీయ పార్టీలను తిట్టినట్లుగానే అధికారంలోకి ఇచ్చినా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలపై ఆరోపణలు మాని ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు.

 

 అదే విధంగా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెలే భాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి తన మార్కును నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వాలనే విమర్శిస్తూ జగదీష్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top