రెండిళ్లలో చోరీ

రెండిళ్లలో చోరీ - Sakshi

  •      22 తులాల బంగారం, నగదు అపహరణ

  •      సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు

  •      అంతర్రాష్ట్ర ముఠా పనేనా...?

  • నాగోలు: దొంగలు వరుసగా రెండిళ్ల తాళాలు పగులగొట్టి 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఆర్‌కేపురం హరిపురికాలనీ రోడ్ నెం-2లో నివాసముండే బిల్డర్ ఎస్‌కే బాషా ఆదివారం తన ఇంటికి తాళం వేసి మియాపూర్ వెళ్లాడు. బాషా ఇంటి మొదటి అంతస్తులో తోటపల్లి శ్రీకాంత్, హరిత దంపతులు అద్దెకుంటూ అదే కాలనీలో కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఇంట్లో పూజ ఉండటంతో హరిత ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా వెళ్లారు.



    ఆరుగురు దొంగల పక్కింట్లో నుంచి లోపలికి ప్రవేశించి బాషా కార్యాలయ తాళాన్ని పగులగొట్టి అందులో ఉన్న కేబుల్ సెటప్‌బాక్స్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. తర్వాత శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లి.. బీరువా తాళం పగులగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు నగలు, రూ.10 వేల నగదు అపహరించారు. సోమవారం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే కాలనీలోని ఫ్లాట్ నెం-17లో విశాఖపట్నానికి చెందిన వ్యాపారి వేగరాజు సత్యనారాయణ కుటుంబం ఉంటోంది.



    ప్రస్తుతం సత్యనారాయణ విశాఖలో ఉండగా, ఇంట్లో భార్య సునీత, కొడుకు ఆదిత్య ఉంటున్నారు. సునీతకు ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం విజయవాడకు వెళ్లింది. కుమారుడు ఆదిత్య ఆదివారం ఇంటికి తాళం వేసి స్నేహితుల వద్దకు వెళ్లాడు. తాళం పగులగొట్టి వీరింట్లోకి చొరబడ్డ దొంగలు పెంపుడు కుక్కకు మత్తు బిసెట్లు పెట్టి స్పహకోల్పోయేలా చేశారు.  తర్వాత బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆదిత్య చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

     

    సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు..

     

    ఇంటి యజమాని బాషా తన ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన విధానం మొత్తం రికార్డు అయింది.   ఆరుగురు సభ్యుల ముఠా పదునైన ఆయుధాలు, ఇనుప రాడ్లు, టార్చ్‌లైట్లు, ఇతర సామగ్రితో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడింది. అయితే, అక్కడే ఉన్న మరో సీసీ కెమెరాను గమనించిన దొంగలు దానిని తొలగించారు. ఎల్బీనగర్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, మురళీకృష్ణ ఘటనా  చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. పోలీసులు  సీసీ కెమెరా ఫుటేజీను స్వాధీనం చేసుకొని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడింది కరుగట్టిన ముఠా కావచ్చని స్థానికులంటున్నారు.

     

    హిందీ పేపర్ లభ్యం..

     

    హరిపురికాలనీ రోడ్ నెం-2లో ఇళ్లు చివరిగా ఉండటంతో పాటు ఇళ్ల పక్కన ఎక్కువగా ఖాళీ స్థలాలున్నాయి. దొంగలు మొదటగా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివయ్య ఇంట్లోకి ప్రవేశించారు. వారు ఇంట్లో ఉండటంతో అక్కడే సిగరెట్లు తాగి నాగ్‌పూర్‌కు చెందిన ఓ హిందీ న్యూస్ పేపర్‌ను అక్కడే పడేసి గోడదూకి బయటకు వచ్చారు. పక్కనే ఉన్న బాషా, శ్రీకాంత్, సత్యనారాయణ ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో ఆ ఇళ్లో చోరీకి తెగబడ్డారు. చోరీకి పాల్పడిన ముఠా మన రాష్ట్రానికి చెందిందా? లేక పోలీసుల దృష్టి మరలించేందుకు హిందీ పేపర్‌ను ఘటనా స్థలంలో వదిలేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్, ఎల్‌బీనగర్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, మురళీకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top