తెలంగాణలో సోయ విత్తనోత్పత్తి


కల్హేర్: మెదక్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాం నారాయణఖేడ్ నియోజకవర్గం ఇక విత్తన భండగారంగా వెలుగొంనుంది. తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సోయబీన్ విత్తనోత్పత్తి చేపట్టెందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొదటిసారిగా సోయబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. కల్హేర్, కంగ్టీ, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో 1,000 ఎకరాల చొప్పున సోయబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.


సోయబీన్ సాగు కోసం ప్రభుత్వం గతంలో మద్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది. ఖేడ్ ప్రాంతాంలో సోయబీన్ విత్తనోత్పత్తి చేపట్టడంతో రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం రైతులకు సరఫరా చేసేందుకు కావాల్సిన 3 వేల బస్తాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. విత్తనోత్పత్తి చేపట్టేందుకు రైతులకు విత్తనాలను సబ్సిడిపై సరఫరా చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సీడ్స్ కార్పోరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డిఏం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయబీన్ విత్తనోత్పత్తిపై రైతన్నలకు అవగాహన కలిపించారు.



సాధారణ నేలలు అనుకూలం..

సోయబీన్ విత్తనోత్పత్తి కోసం సాధరణ భూములు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్‌లో తోలకరి వర్షాలు కురిస్తే జూన్ మొదటి వారం నుంచి నెలాఖరి వరకు సోయ సాగు చేపట్టవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు ఉంటుంది. సోయ విత్తనోత్పత్తికు సంబందించి సీడ్స్ కార్పోరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఓప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఒప్పందం మేరకు రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండ తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్‌కు విక్రయించడమే ఒప్పందం ఉద్దేశం. పంట చేతికి వచ్చాక మార్కెట్‌లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా చెల్లించి సీడ్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు కూడా ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ ఉత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు రాష్ట్రంలోని రైతులకు సరఫరా చేసే అవకాశం ఖేడ్ రైతులకు దక్కింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top