రూ.30 వేల కోసం తండ్రిని చంపి..
లింగంపేట(కామారెడ్డి జిల్లా):
కేవలం రూ.30 వేల కోసం తండ్రిని ఓ తనయుడు హతమార్చాడు. ఈ సంఘటన లింగంపేట మండలం శెట్పల్లిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మూడం పోచయ్య, మూడం ఆశయ్య తండ్రీ కొడుకులు. రుణమాఫీ డబ్బులు వాడుకుంటూ తనకు అన్యాయం చేశాడని ఆశయ్య తమ పొలంలోనే తండ్రి పోచయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కోపంతో తండ్రి నెత్తిపై కర్రతో బలంగా కొట్టాడు.
దీంతో తీవ్ర రక్త స్రావమైన పోచయ్య అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన శవాన్ని సమీప అడవిలో దహనం చేశాడు. తీరిగ్గా తండ్రి కనపడటం లేదని రెండు రోజుల క్రితం ఆశయ్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణలో కుమారుడే హత్య చేశాడని తేల్చారు. నిందితుడిని అదుపులోకి స్టేషన్కు తరలించారు.