తమ్ముడిని హతమార్చిన అక్క

తమ్ముడిని హతమార్చిన అక్క - Sakshi


కొడంగల్ : కుటుంబ కలహాలు ఓ బాలుడి ప్రాణం తీశాయి.. తమ్ముడిని ఓ అక్క గొంతునులిమి హతమార్చింది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన ఆదివారం మండలంలోని చిట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిట్లపల్లికి చెందిన అబ్దుల్‌హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మైమూదాకు నలుగురు కూతుళ్లు. రెండోభార్య బెర్హానిబేగంకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అదేగ్రామంలో మొదటిభార్య, పిల్లలు వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరు సవతులకు మధ్య ఎన్నోసార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. అవి పిల్లల మధ్య మరింత కక్షపెంచాయి. కాగా, హుస్సేన్ మొదటిభార్య బాగోగులు చూసేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు.



ఇదిలాఉండగా, ఆదివారం ఉదయం అక్క అసియాబేగంకు కూరగాయలు ఇచ్చేందుకు తమ్ముడు అబ్దుల్‌నిసార్ (9) వెళ్లాడు. తండ్రి, మొదటి తల్లిపై ఉన్న అక్కసుతో అక్క అసియా బేగం తమ్ముడి గొంతునులిమి చంపేసింది. మృతదేహాన్ని ఇంటి ఎదురుగా ఉన్న పొదల్లోకి విసిరేసింది. అక్క వద్దకు వెళ్లిన తమ్ముడు ఎంతకూ రాకపోయేసరికి తల్లికి అనుమానం వచ్చింది. అక్కడికి వెళ్లి వాకబుచేయగా ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. తానే హతమార్చినట్లు నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top