అధికార పార్టీలో గ్రానైట్ వార్!

అధికార పార్టీలో గ్రానైట్ వార్!


చెక్‌పోస్టుల ఎత్తివేతపై స్వపక్ష నేతల రుసరుస

 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో గ్రానైట్ వార్ కొనసాగుతూనే ఉంది. గ్రానైట్ ఓవర్‌లోడ్‌తోపాటు ఇతర అక్రమాలను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను రాత్రికి రాత్రే ఎత్తివేయడంతో ప్రతిపక్ష పార్టీలోనూ, అధికార పార్టీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రానైట్ అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయారు.



గ్రానైట్ అనుకూలవర్గం తమకున్న అధికార, అంగ, అర్థబలంతో చెక్‌పోస్టులను ఎత్తివేయించిందని భావిస్తున్న వ్యతిరేకవర్గం జిల్లాలో గ్రానైట్ పేరిట జరుగుతున్న అక్రమాలను, గ్రానైట్ వల్ల ప్రజలకు, పర్యావర ణానికి జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.



ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలున్న నేపథ్యంలో వారు దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. త్వరలోనే గ్రానైట్ వ్యతిరేక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా సమావేశమై తగిన కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గ్రానైట్ అనుకూల ఎమ్మెల్యేలు, నాయకుల్లో తమ అభీష్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తివేయించడంలో సక్సెస్ అయ్యామనే భావన వ్యక్తమవుతోంది.  



 మంత్రికి తెలియకుండానే ఎత్తేశారా?

 గ్రానైట్ చెక్‌పోస్టుల ఎత్తివేత అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రి ఈటెల రాజేందర్ సన్నిహితులు చెక్‌పోస్టుల ఎత్తివేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి తెలియకుండానే చెక్‌పోస్టులను ఎత్తివేశారని చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో అధికారుల బదిలీలు, ఇతరత్రా ముఖ్యమైన వ్యవహారాలు మంత్రికి సంబంధం లేకుండా జరిగిపోతున్నాయని వాపోతున్నారు.



కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సిఫారసు చేసిన వారికే పోస్టింగులివ్వడంతోపాటు పనులను కట్టబెట్టేవారని, ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెల సైతం జరుగుతున్న పరిణామాలను లోలోపలే దిగమింగుకుంటున్నారే తప్ప పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా, సీనియర్ నాయకుడిగా తానే అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదనే భావనతో ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది.



 జెడ్పీ సమావేశం నుంచి తీవ్రమైన పోరు

 గతంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా అధికార పార్టీ నేతల మధ్యనున్న గ్రానైట్ విబేధాలు బయటపడ్డాయి. ఆ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రానైట్ వ్యాపారానికి అనుకూలంగా మాట్లాడగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే కావడంతో పార్టీలో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.



ఈ సమయంలోనే గ్రానైట్ వ్యాపారుల అక్రమాలు పత్రికల ద్వారా వెలుగుచూస్తుండడం పార్టీని కుదిపేసింది. ఓవర్‌లోడ్, తదితర అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, తాజాగా ప్రభుత్వ ఁముఖ్య*నేత నుంచి గ్రానైట్ వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయం రావడంతో గ్రానైట్ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. గ్రానైట్ అక్రమాలపై గొంతెత్తాలని ఉన్నా పెద్దల అండదండలు ఎదుటివారికే ఉండడంతో కిమ్మనడం లేదు. తమను పట్టించుకోకుండా గ్రానైట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరుపై మాత్రం లోలోన మండిపడుతున్నారు.



తాము కూడా ప్రజాప్రతినిధులమేనని, ఓవైపు తాము అభ్యంతరం చెబుతుంటే, తమను కాదని ఏకంగా పెద్దల స్థాయిలో ఒప్పందం కుదుర్చోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి చెక్‌పోస్టుల ఎత్తివేతపై బహిరంగంగా పెదవి విప్పకపోయినప్పటికీ అదను కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న విభేదాలు తమను ఎక్కడ ముంచుతాయోనని గ్రానైట్ వ్యాపారులు వాపోతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top