నన్ను క్షమించండి..!


‘‘ నన్ను క్షమించండి.. చదువులో రాణించి డాక్టర్ కావాలన్న నా కలను నెరవేర్చుకో లేకపోతున్నాను. నా తల్లిదండ్రులు నాతో ప్రేమగా ఉండడం లేదు. దీనివల్ల నేను కొంత ఆందోళనకు గురయ్యా.. నేను చదువులో ఫస్ట్ ఉంటూ అందరి మన్ననలు పొందాను. ఉపాధ్యాయులు కూడా నాతో సక్రమంగా మాట్లాడడం లేదు.

 

 ఈ మధ్యకాలంలో ప్రిన్సిపాల్ నాతో కొంత అసౌకర్యంగా ఉంటున్నారు. నేను మరింత బాధకు గురయ్యాను. నాలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు..’’ అని జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లిలో ఆత్మహత్మకు పాల్పడిన విద్యార్థిని మమత(13) సూసైడ్ నోట్‌లో తన ఆవేదన వ్యక్తపరిచింది.      

 

 మహబూబ్‌నగర్ క్రైం: తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన రత్నం, సులోచన కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. పెద్దకుమార్తె మమత (13) చిట్టెబోయినిపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చ దువుతోంది. చదువులో రాణిస్తూ ఉపాధ్యాయుల మన్నలను పొందింది. దీనికితోడు క్రీడల్లో పలు అంశాల్లో నైపుణ్యం సాధించింది. ఇదిలాఉండగా, గురువారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయానికి రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లిచూడగా ఉరేసుకుని కనిపించింది. హుటాహుటిన చికిత్సకోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. సంఘటన తెలుసుకునేందుకు ఏజేసీ డాక్టర్ రాజారాం జిల్లా ఆస్పత్రిని సందర్శించి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో కారణాలు తెలుసుకున్నారు. డాక్టర్ కావాలనుకున్న కలను నెరవేర్చలేకపోతున్నానని సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.  కాళ్ల వెండిపట్టీలు, రూ.200లను క్లాస్‌టీచర్‌కు ఇస్తున్నట్లు రాసింది.

 

 ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే..

 గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జయంతి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని విద్యార్థిని మమత తల్లిదండ్రులు రత్నం, సులోచన ఆరోపించారు. కూతురును విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. చదువులో ఎప్పుడూ ఫస్ట్‌గా ఉండే తమ కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు ఉన్నాయని విలపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు రోదించారు.

 

 ‘స్వేరోస్’ విచారం

 ఎంతో భవిష్యత్ ఉన్న మమత మృతిపట్ల స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.విజేందర్, రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్.స్వాములు, జిల్లా ప్రధానకార్యదర్శి టి.కృష్ణ, ఎం.వెంకట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులదే అన్నారు.

 

 ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి

 మహబూబ్‌నగర్ క్రైం: చిట్టెబోయిన్‌పల్లి గురుకుల పాఠ శాల ప్రిన్సిపాల్ జయంతిని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థిని మమత(13) మృతికి ప్రిన్సిపాల్ జయంతే కారణమని కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించారు. జడ్చర్ల సీఐలు జంగయ్య, గిరిబాబు, టూటౌన్ సీఐ సోమ్‌నారాయణ్‌సింగ్, ఎస్సై రమేశ్‌లు  బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

 

 నివేదిక కోరినబాలల

  హక్కుల కమిషన్

  మమత(13) మృతిపై వచ్చేనెల 3వ తేదీలోగా సమగ్రనివేదిక సమర్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. బాలిక మృతికి ప్రిన్సిపాల్ జయంతే కారణమని తండ్రి చెప్పాడని పేర్కొంది. బఅంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందించాలని కోరింది. చదువు, ఆటాపాటల్లో ప్రతిభావంతురాలిగా ఉన్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం పట్ల విచారం వ్యక్తంచేసింది.

 

 ప్రిన్సిపాల్‌పై అట్రాసిటీ కేసునమోదు

 మమత ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ జయంతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసినట్లు సీఐ జంగయ్య తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు తన సూసైడ్‌నోట్‌లో పేర్కొనడంతో ఆమెపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top