ఇసుక మాఫియా బరితెగింపు

ఇసుక మాఫియా బరితెగింపు - Sakshi


బెదిరించి లారీని తీసుకెళ్లిన నిర్వాహకులు

పిన్నంచర్ల శివారులో  మరో వాహనం పట్టివేత


 

ఆత్మకూర్ :

ఇసుక బకాసురులు బరితెగిస్తూనే ఉన్నారు.. ఎలాంటి అనుమతులు లేకుం డా లారీల్లో టన్నుల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అధికారులు దాడిచేసి ఓ లారీని పట్టుకోగా, బెదిరించి మరో వాహనాన్ని ఇసుక మాఫియా తీసుకెళ్లిపోయింది.. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆత్మకూర్ మండ లం పిన్నంచర్ల శివారులో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌లోని నీటి ట్యాంకు సమీపంలో కొందరు వ్యక్తులు ఇసుక డంప్‌లు ఏర్పాటుచే శారు. అక్కడి నుంచి యథేచ్ఛగా లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ గోపాల్‌నాయక్ బృందం ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి పిన్నంచర్ల శివారులో ఓ లారీని పట్టుకున్నారు. అందులో 50 టన్నుల నుంచి 60 టన్నుల వరకు ఇసుక ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీజ్ చేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.



అంతకుముందు అల్లీపూర్ సమీపంలో మరో లారీని రెవెన్యూ సిబ్బంది పట్టుకోగా ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు బెదిరిం చి వాహనాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఆర్‌ఐ రాజాగణేష్, వీఆర్‌ఓ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, ఆత్మకూర్ మండలం కర్వెనలోని ఊకచెట్టువాగులో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ శివారులో అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను డంప్‌చేసి రాత్రివేళ లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడు లు నిర్వహించి పట్టుకుంటున్నా నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వదిలేస్తున్నట్లు సమాచారం. ఈ తంతు ఇలాగే కొనసాగితే భూగర్భజలాలు ఇంకిపోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 

 నామమాత్రపు జరిమానా



దేవరకద్ర : మండలంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతోంది. బస్వాపూర్ సమీపంలోని వాగులో నుంచి ప్రతిరోజూ డజన్ల కొద్దీ ట్రాక్టర్లు ఇసుకను డంపు చేస్తుండగా రాత్రికి రాత్రి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెంకంపల్లి, కిష్టం పల్లి, పేరూర్  నుంచి టిప్పర్లలో భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. గ్రామ నాయకులు గ్రూపులుగా ఏర్పడి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తెచ్చి డంపు లు వేసి రాత్రివేళ టిప్పర్లను రప్పించి తరలిస్తున్నారు. ఆరురోజుల క్రితం పేరూర్ వద్ద రెండు ఇసుక టిప్పర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వాటిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మూడు రోజులైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటిపై కేసులు నమోదు చేస్తే కనీసం విడిపించుకోవడానికి నెల రోజులపైనే అవుతుంది. ఇక కోర్టు, ఇత ర ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ పరిస్థితుల్లో అధికారులతో బేరం పెట్టి చివరకు ఒక్కో ఇసుక టిప్పర్‌కు *15 వేలు జరిమానా చెల్లించి వాటిని నిర్వాహకులు విడిపించుకుపోయారు.   

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top