స్కూటరిస్ట్ ప్రాణం తీసిన సైలెన్సర్
సికింద్రాబాద్: ఆర్టీసీ బస్సు సైలెన్సర్ (పొగ్గొట్టం) ఊడి వెనుక వస్తున్న స్కూటర్ ముందు చక్రానికి అడ్డంగా పడింది. దీంతో స్కూటర్పై వెళ్తున్న వ్యక్తి ఎగిరి అదే బస్సు వెనుక చక్రం కిందపడి మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన గురువారం లాలాగూడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... మల్కాజిగిరి వసంత్పురం కాలనీకి చెందిన ఎం.జగదీష్(45) సికింద్రాబాద్ మోండా మార్కెట్లో స్కూటర్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం స్కూటర్ (ఏపీ 09 హెచ్ 5266)పై తన షాప్కు బయలుదేరాడు. మీర్జాలాగూడ్ చౌరస్తా సమీపంలోని రైల్వే గర్ల్స్ హైస్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న సికింద్రాబాద్- ఈసీఐఎల్ ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 2121) సెలైన్స్ర్ (పొగ్గొట్టం) ఊడి జగదీష్ స్కూటర్ ముందు చక్రానికి అడ్డుగా పడింది.
దీంతో అతను ఎగిరి బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. భార్య రాధిక ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.