ఎయిర్పోర్ట్కు వెళ్లివచ్చేసరికే...
-
ఇంట్లో 60 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు అపహరణ -
గంట వ్యవధిలోనే భారీ చోరీ
చాదర్ఘాట్: ఇంటికి తాళం వేసి తిరిగి వచ్చే సరికే దొంగలు నగలు, నగదును పహరించుకుపోయారు. చాదర్ఘాట్ సీఐ రాజావెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రిటైర్డ్ ఉద్యోగి రహీమ్ఖాన్ (60) కాలాడేరాలో నివాసముంటున్నాడు. ఉదయం 8.30 గంటలకు ఆయన బంధువులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. వారు ఇంటికి చేరుకుంటున్న సమయంలో పనిమనిషి రహీమ్ఖాన్ ఇంటికి వచ్చింది. అయితే ఇంటి తలుపుల గడియలు విరగ్గొట్టి ఉన్న విషయాన్ని గమనించి, విషయాన్ని రహీమ్ఖాన్కు ఫోన్చేసి తెలిపింది.
ఇంటికి చేరుకున్న రహీమ్ఖాన్ లోనికి వెళ్లి చూడగా.. బెడ్రూమ్లోని రెండు బీరువాల తాళాలు పగులగొట్టి వాటిలో దాచి ఉంచిన అతని, ఆయన బంధువులకు చెందిన 60 తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్తో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
చోరీపై అనుమానాలు..
చోరీకి వచ్చిన దొంగలు ఇంటి ముందు ఉన్న గేటు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. అలా కాకుండా తాళాలు తీసి లోనికి ప్రవేశించటం, చోరీ అనంతరం తాళంతో సహా పరారు కావటం పలు అనుమానాలు తావిస్తోంది. అంతేకాకుండా ఇంట్లోని నాలుగు బీరువాల్లో రెండింటిని పగులగొట్టి మరో రెండు బీరువాలను వదిలివేయటం, ఒక బీరువాలో వున్న 15 తులాల బంగారు నగలను వదిలిపెట్టి వెళ్లిపోవటం, గంటలోపే ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడం పక్కా తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.