ఒక్కరోజు రూ.307 కోట్లు


- 60 వేల మంది రైతులకు పంట రుణం

- ఫలితమిచ్చిన స్పెషల్‌డ్రైవ్

కరీంనగర్ అగ్రికల్చర్ : ఖరీఫ్‌సీజన్ ఆఖరున అన్నదాతకు కొంతమేర సంతోషాన్నిచ్చింది. పెట్టుబడులు కోల్పోయి వడ్డీవ్యాపారులను అప్పుల కోసం ఆశ్రయించే సమయంలో బ్యాంకర్లు కనికరించారు. ఆఖరు రోజు అరవై వేలమందికిపైగా రూ.307 కోట్ల రుణాలందించినట్లు లీడ్‌బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి తెలిపారు. ఖరీఫ్ రుణకాలపరిమితి పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సమీక్ష అనంతరం మంగళవారం పంట రుణాల మంజూరుకు చేపట్టిన స్పెషల్‌డ్రైవ్ రైతులకు మేలు చేకూర్చింది. జూన్‌లో మొదలైన ఖరీఫ్ సీజన్‌కు గాను రూ.900 కోట్ల పంటరుణాల మం జూరుకు బ్యాంకర్లు లక్ష్యం విధించుకున్నారు.



ఇప్పటివరకు రూ.400 కోట్లు మాత్రమే 20 శాతం మందికి రుణాలిచ్చారు. ఇంకా రూ.500 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. రుణమాఫీ విషయంలో చర్చోపచర్చల అనంతరం మొదటివిడతగా జిల్లావ్యాప్తంగా 3,73,877 మంది రైతులకు రూ.1656 కోట్ల పంట రుణాలమాఫీకి గాను.. జిల్లాకు రూ.414.21 కో ట్లు నిధులు విడుదల చేశారు.  వాటిని సంబంధిత బ్యాంకులకు జమచేశారు. ఆఖరు రోజు లబ్ధిదారులందరికీ రుణాలిస్తామంటూ బ్యాంకర్లు ఒక్క రోజే అవకాశం కల్పించారు.



ఒక్కరోజులో మిగిలిన రూ.500 కోట్ల పంటరుణాలను మం జూరుచేయడమే లక్ష్యంగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఈ ఒక్క రోజులో రూ.307 కోట్ల  పంట రుణాన్ని 60వేల మంది రైతులకు అందజేశారు. మొత్తంగా ఖరీఫ్ సీజన్ లక్ష్యంలో రూ. 183 కోట్ల రుణాలను ఇవ్వలేకపోయారు. సీజన్ మొత్తంలో రూ.900 కోట్ల పంట రుణ లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.707 కోట్లను 1.40 లక్షల మంది రైతులకు ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top