హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు: కేసీఆర్
హుస్సేన్సాగర్ ప్రక్షాళన పనులను వెంటనే ప్రారంభిస్తామని, దీనికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హుస్సేన్సాగర్ ప్రక్షాళన, అభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణం, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి హుస్సేన్సాగర్ చుట్టూ మొదటి దశలో వంద ఎకరాల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణం చేపడతామని చెప్పారు.
యుద్ధప్రాతిపదికన 40 కోట్లతో ఆకాశ హర్మ్యాల నిర్మాణం చేపడతామని, అందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఆయన అన్నారు. ఇందిరాపార్కులో వినాయకసాగర్ పేరిట వినాయక నిమజ్జనం కోసం చెరువు నిర్మాణం చేపడతామని తెలిపారు. హుస్సేన్సాగర్ మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ నిర్మాణం చేపడతామన్నారు.