రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిగురుమామిడి(కరీంనగర్): లారీ రాంగ్రూట్లో వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిగురుమామిడికి చెందిన మాడిశెట్టి రాజయ్య అలియాస్ బుచ్చి(37), బాషవేని నందయ్య అలియాస్ నందు(43) అనే ఇద్దరు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో హుస్నాబాద్ వైపు వెళ్తున్నారు.
సుందరగిరి సమీపంలో హుస్నాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ రాంగ్రూట్లో వచ్చి వారిని ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రాజయ్య, నందయ్యలకు భార్య, పిల్లలున్నారు. ఇద్దరూ చిన్న ఉద్యోగాలు చూసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారే. వారి మరణంతో ఆ కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా పోయింది.