మహిళపై ఆర్‌ఎంపీ లైంగికదాడికి యత్నం


బొమ్మలరామారం (ఆలేరు): వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ ఆర్‌ఎంపీ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 27న కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ గాజులరామారంలోని ప్రజా నర్సింగ్‌ హోమ్‌కు తన తల్లితో వెళ్లింది. ఆస్పత్రి నిర్వాహకుడు (ఆర్‌ఎంపీ) ఇజాజ్‌ పాషా వైద్యపరీక్షల కోసమని ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో  జరిగిన విషయాన్ని ఆమె తన భర్తకు తెలిపింది.  బాధితురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్‌ఎంపీనకు ఫోన్‌ చేసి ఆస్పత్రికి వస్తున్నామని ఉండాలన్నాడు.



దీంతో భయాందోళన చెందిన ఆర్‌ఎంపీ బాధితురాలి ఊరికి వెళ్లి తనది పొరపాటేనని చెప్పుకొచ్చాడు. దీంతో బాధితురాలి భర్త, మరో వ్యక్తి  కలసి ఆర్‌ఎంపీపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తనని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి దాడి చేశారని ఆర్‌ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత మహిళ తనపై ఆర్‌ఎంపీ లైంగికదాడికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇరువర్గాలపైనా కేసులు నమోదైనట్లు తెలిసింది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top