'కేసీఆర్ కేబినెట్‌లో రౌడీలు, దొంగలు'


ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ద్రోహం చేసిన రౌడీలు, దొంగలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని టీఎన్‌జీఓ హాల్‌లో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార వ్యామోహంతో పార్టీలు మారుతున్న వారిని టీఆర్‌ఎస్ అందలమెక్కిస్తోందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.





టీడీపీని సెంటిమెంట్, అధికారంతో దెబ్బతీయలేరన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హైదరాబాద్‌లో గల్లీగల్లీ తిరుగుతూ మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అధికారంతో విర్రవీగుతున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ సత్తా ఏమిటో చూపించాలన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.





తుమ్మల నాగేశ్వరరావు, ఎంటీసీసీలు, జెడ్పీటీసీలు టీడీపీని వీడడంతో జిల్లాలో పార్టీ పనైపోయిందని ప్రచారం జరుగుతుందని, జిల్లాలో పార్టీకి పెట్టని కోటలా ఉన్న కార్యకర్తల బలమే తమ సత్తా ఏంటో నిరూపిస్తుందన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మారిన ద్రోహులకు ఓటమి తప్పదన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. రెండోసారి తుళ్లూరి బ్రహ్మయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మహానాడులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top