కేసీఆర్ ఓ జలగ: రేవంత్రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీలుస్తున్న జలగ అని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఎ.రేవంత్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా మారిందని, తెలంగాణ పేరుతో ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని అన్నారు. రైతు సమస్యలపై శాసనసభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. కరువు, నీటి సమస్య, అవినీతి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు.
టీడీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఆయన ప్రసంగంపై నిరసన తెలుపుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పోరాడలేక కాడి కిందపడేసిందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కేంద్రబడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ప్రశ్నించారని, కానీ కూతురు పదవి కోసం తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. చినజీయర్ స్వామి దృష్టిలో కేసీఆర్ జాతిపిత అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంతాచారి ఎవరని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి తానిచ్చిన బిరుదును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.